సౌజన్య శుభారంభం 

20 Feb, 2020 09:58 IST|Sakshi

ఐటీఎఫ్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణులు సౌజన్య బవిశెట్టి, సామ సాతి్వక శుభారంభం చేశారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సౌజన్య సింగిల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి... డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సౌజన్య 6–3, 6–4తో ఐదో సీడ్‌ వలేరియా స్ట్రకోవా (ఉక్రెయిన్‌)ను బోల్తాకొట్టించింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సౌజన్య మూడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 

తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. డబుల్స్‌ తొలి రౌండ్‌లో సౌజన్య (భారత్‌)–నికోలా బ్రెకోవా (చెక్‌ రిపబ్లిక్‌) ద్వయం 3–6, 6–3, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మూడో సీడ్‌ రియా భాటియా (భారత్‌)–బెర్ఫు సెన్‌గిజ్‌ (టర్కీ) జోడీపై సంచలన విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌ మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో దక్షిణాసియా క్రీడల చాంపియన్‌ సామ సాత్విక 6–2, 6–4తో క్వాలిఫయర్‌ సౌమ్య (భారత్‌)ను ఓడించింది. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో తెలుగమ్మాయిలు నిధి చిలుముల, పెద్దిరెడ్డి శ్రీవైష్ణవి ఓడిపోయారు. నిధి 5–7, 0–6తో సకూరా హొండో (జపాన్‌) చేతిలో... శ్రీవైష్ణవి 3–6, 2–6తో రుతుజా భోస్లే (భారత్‌) చేతిలో ఓటమి చవిచూశారు.  

మరిన్ని వార్తలు