రన్నరప్‌ సౌజన్య జోడీ

5 Aug, 2019 10:09 IST|Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణులు సౌజన్య భవిశెట్టి, శ్రావ్యశివాని చిలకలపూడి రాణించారు. ట్యునీషియాలోని టబర్కా వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జంటగా మహిళల డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. ఫైనల్లో నాలుగో సీడ్‌ సౌజన్య–శ్రావ్య శివాని జంట 2–6, 2–6తో మూడో సీడ్‌ ఎవా వెడెర్‌–స్టీఫెన్‌ జుడిత్‌ విసెర్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో సౌజన్య–శ్రావ్య శివాని ద్వయం 7–5, 3–6, 10–6తో రెండోసీడ్‌ అడెలినా బరవి–విక్టోరియా మిఖైలోవా (రష్యా) జంటను కంగుతినిపించింది. క్వార్టర్స్‌లో 6–3, 6–3తో అండ్రియానా పినో–గియా స్వార్‌సియాలుప్‌ (ఇటలీ) జోడీపై, ప్రిక్వార్టర్స్‌లో 6–1, 6–1తో ఒలింపి లాన్స్‌లాట్‌ (ఫ్రాన్స్‌)–డెనిజ్‌ పాకోవ్‌ (టర్కీ) జంటపై విజయం సాధించారు.

సింగిల్స్‌ విభాగంలో వీరిద్దరూ తొలిరౌండ్‌లోనే ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో శ్రావ్య శివాని 3–6, 1–6తో ఎనా కజెవిక్‌ (క్రొయే షియా) చేతిలో, రెండోసీడ్‌ సౌజన్య 1–6, 2–6తో స్టీఫెన్‌ జుడిత్‌ విసెర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లోనూ భారత క్రీడా కారులకు కలిసి రాలేదు. ప్రిక్వార్టర్స్‌లో తరుణ్‌ అనిరుధ్‌ చిలకలపూడి (భారత్‌)–మాజెద్‌ కిలాని (ట్యునీషియా) జంట 6–7 (7/9), 3–6తో నాలుగోసీడ్‌ ఇగ్నాసియో కారో–ఫెమిన్‌ టెంటి (అర్జెంటీనా) జంట చేతిలో... అనిరుధ్‌ చంద్రశేఖర్‌–విఘ్నేశ్‌ పెరణమల్లూర్‌ (భారత్‌) ద్వయం 4–6, 5–7తో మూడోసీడ్‌ మాట్స్‌ హెర్మన్స్‌–బార్ట్‌ స్టీవెన్స్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయాయి.  

మరిన్ని వార్తలు