చెన్నై కోసం పుణెకు ప్రత్యేక రైలు

19 Apr, 2018 23:08 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. రెండేళ్ల నిషేధం తర్వాత సొంతగడ్డపై చెన్నై ఆడుతుంటే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, తమిళనాట కావేరీ జల వివాదం వేడెక్కడంతో చెన్నై మ్యాచ్‌లన్నీ పుణెకు తరలించినట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా వేలాది అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఇలా జరిగినందుకు వారేమీ బాధపడలేదు. పుణెను సొంతగడ్డగా భావించి మ్యాచ్‌లాడుతున్న తమ జట్టుకు ఎలా అయినా మద్దతు ఇవ్వాలనుకున్నారు. వారి అభిలాషను ఆ జట్టు యాజమాన్యానికి తెలిపారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు.

కేంద్ర రైల్వే శాఖను సంప్రదించి చెన్నై నుంచి పుణెకు ప్రత్యేక రైలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనకు అధికారులు కూడా పచ్చజెండా ఊపడంతో ఇక ఆ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ ప్రత్యేక రైలు గురువారం చెన్నై నుంచి క్రికెట్‌ అభిమానులతో పుణె బయలుదేరింది. పసుపు రంగు జెర్సీలు, పచ్చ జెండాలతో రైలంతా పసుపుమయంగా మారిపోయింది. ‘సీఎస్‌కే.. సీఎస్‌కే’అనే నినాదాలతో ట్రైనంతా మార్మోగిపోయింది. ఇంతకీ ఈ రైలు పేరేంటో తెలుసా ‘విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్‌’. టోర్నీలో భాగంగా శుక్రవారం పుణె వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌–రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు