ఖేల్‌ ఖతమ్‌... 

13 Mar, 2020 04:09 IST|Sakshi

‘కరోనా’ కారణంగా కుదేలవుతున్న క్రీడా సంబరాల జాబితా చూస్తే... 

►భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 15, 18 తేదీల్లో రెండో, మూడో వన్డే జరగాల్సి ఉంది. లక్నో, కోల్‌కతాలో జరిగే ఈ మ్యాచ్‌లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించరాదని బీసీసీఐ నిర్ణయించింది. టికెట్ల అమ్మకాలు నిలిపివేశారు.  
►ముంబైలో సచిన్, లారా తదితర మాజీ క్రికెటర్లతో జరుగుతున్న రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ టోర్నీ కూడా రద్దయింది. ముందుగా ప్రేక్షకులు లేకుండా ఆడించాలని భావించినా...చివరకు నిర్వాహకులు రద్దుకే మొగ్గు చూపారు.  
►రాజ్‌కోట్‌లో బెంగాల్, సౌరాష్ట్ర మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌ చివరి రోజైన నేడు మైదానంలో ప్రేక్షకులకు ప్రవేశం లేదు.  
►ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తామని భారత్‌ బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) బుధవారం ప్రకటించినా... కేంద్ర ప్రభుత్వ తాజా వీసా నిబంధనలతో విదేశీ ఆటగాళ్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దాంతో టోర్నీ నిర్వహణ కూడా సందేహమే.  
►ప్రపంచంలోనే అతి పెద్ద, అమెరికాలోని ప్రతిష్టాత్మక నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) లీగ్‌ ఈ సీజన్‌కు సంబంధించి మ్యాచ్‌లన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అతి పెద్ద నిర్ణయం.  
►ప్రతిష్టాత్మక ఫార్ములా 1 సీజన్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరగాల్సిన తొలి గ్రాండ్‌ప్రి రద్దయింది. ముందుగా మెక్లారెన్‌ జట్టు సభ్యుడొకరు కరోనా బారిన పడటంతో ఆ జట్టు మాత్రమే తప్పుకునేందుకు సిద్ధమైనా... ఇతర జట్ల ఒత్తిడితో నిర్వాహకులు మొత్తంగా రద్దు చేసేశారు.  
►చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య ఈ శనివారం గోవాలో జరగాల్సిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదు.  
►భారత దేశవాళీ ఫుట్‌బాల్‌ టోర్నీ ఐ లీగ్‌లో జరగాల్సిన 28 మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారు.  
►ప్రఖ్యాత స్పానిష్‌ లీగ్‌ ‘లా లిగా’ మ్యాచ్‌లు రద్దయ్యాయి. దాంతో రియల్‌ మాడ్రిడ్‌ ఫుట్‌బాల్‌ జట్టు సభ్యులు బయటకు రాకుండా  స్వచ్ఛందంగా ప్రత్యేక వైద్యు ల పర్యవేక్షణలోకి వెళ్లిపోయారు. రియల్‌ మాడ్రిడ్‌కే చెందిన బాస్కెట్‌ బాల్‌ జట్టు ఆటగాడు ఒకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ రెండు జట్లకు ఒకే చోట వసతి ఏర్పాట్లు ఉన్నాయి.  
►ఖతార్‌లో మార్చి 26నుంచి జరగాల్సిన యూరో 2020 వార్మప్‌ టోర్నీ రద్దయింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖతార్‌లోనే త్వరలో నిర్వహించాల్సిన వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లను వాయిదా వేయాలని దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ గవర్నింగ్‌ బాడీ (కాన్‌మెబాల్‌) ‘ఫిఫా’కు విజ్ఞప్తి చేసింది.  
►జోర్డాన్‌లో ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆడి భారత్‌కు తిరిగి వస్తున్న మన బాక్సర్లందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు వెళ్లరాదని భారత బాక్సింగ్‌ సమాఖ్య ఆదేశించింది.  
►కరోనా కారణంగానే ఈనెల 16 నుంచి జరగాల్సిన టాలెంట్‌ సిరీస్, చాంపియన్‌షిప్‌ సిరీస్, సూపర్‌ సిరీస్, నేషనల్‌ సిరీస్, ‘ఐటా’ పురుషుల, మహిళల ఈవెంట్‌లను రద్దు చేస్తున్నట్లు అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ప్రకటించింది.

మరిన్ని వార్తలు