ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలి

7 Jun, 2017 20:19 IST|Sakshi
ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలి
 
► భారత్న రత్న ప్రకటించాలని క్రీడా మంత్రిత్వ శాఖ పీఎంవో కు లేఖ
 
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌ చంద్‌కు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాసింది. ఈ విషయాన్ని మీడియాతో ఆ శాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ ధృవికరించారు. హాకీలో దేశానికి ఎన్నో విజయాలందించిన ధ్యాన్‌ చంద్‌కు భారత రత్న ప్రకటించి నిజమైన నివాళిలు అర్పిస్తామని గోయల్‌ తెలిపారు. ధ్యాన్‌ చంద్‌ హాకీలో భారత్‌కు 1928,1932,1936 లో స్వర్ణపతకాలందించిన విషయం తెలిసిందే.
 
క్రీడాకారులకు భారత అత్యున్నత పురస్కారం ఇవ్వడం సచిన్‌ టెండూల్కర్‌తో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి క్రీడా శాఖ సచిన్‌తో పాటు  ధ్యాన్‌చంద్‌ పేరును ప్రభుత్వానికి నివేదించింది. కానీ ప్రభుత్వం సచిన్‌ను మాత్రమే ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. దీంతో ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడిగా సచిన్‌ నిలిచాడు. ధ్యాన్‌ చంద్‌ సాధించిన విజయాలను వేటితో పోల్చలేమని, ధ్యాన్‌ చంద్‌ మరణించినపుడే క్రీడాకారులకు భారత రత్న ప్రకటించే అవకాశం ఉంటే ధ్యాన్‌ చంద్‌ ఈ పురస్కారం అందుకున్న తొలి క్రీడాకారుడయ్యే వాడని గోయల్‌ స్పష్టం చేశారు.
 
ప్రధాన మంత్రి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇక ధ్యాన్‌ చంద్‌ జయంతి ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆరోజే  వివిధ క్రీడల్లో రాణించిన అథ్లేట్లకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. ధ్యాన్‌ చంద్‌ కుమారుడు అశోక్‌ కుమార్‌, మాజీ హాకీ ఆటగాళ్లు ధ్యాన్‌ చంద్‌కు భారత రత్న అవార్డు ప్రకటించాలని గతి కొద్దికాలంగా డిమాండ్‌ చేస్తున్నారు.
మరిన్ని వార్తలు