చాంపియన్‌ శ్రావ్య–హుమేరా జోడీ

23 Jun, 2018 10:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) 50కే ప్రైజ్‌మనీ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి శ్రావ్య శివాని సత్తా చాటింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచిన శివాని... సింగిల్స్‌ కేటగిరీలో రన్నరప్‌ ట్రోఫీని అందుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌సీడ్‌ శ్రావ్య శివాని–షేక్‌ హుమేరా (తెలంగాణ) ద్వయం 6–0, 6–4తో ఆకాంక్ష–ముష్రత్‌ అంజుమ్‌ జంటపై గెలుపొందింది.

సింగిల్స్‌ టైటిల్‌పోరులో సహజ యామలపల్లి (తెలంగాణ) 6–4, 6–4తో శ్రావ్య శివానిని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఏపీకి చెందిన బి. సాయి శరణ్‌ రెడ్డి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో టాప్‌ సీడ్‌ పృథ్వీ శేఖర్‌ (తమిళనాడు) 6–3, 6–0తో సాయి శరణ్‌ రెడ్డిపై గెలుపొందాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం కోశాధికారి డి. చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు.

మరిన్ని వార్తలు