మూడో రౌండ్‌లో శ్రీ కృష్ణప్రియ

5 Feb, 2017 01:29 IST|Sakshi
మూడో రౌండ్‌లో శ్రీ కృష్ణప్రియ

పట్నా: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి శ్రీ కృష్ణప్రియ మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో మూడో సీడ్‌ శ్రీ కృష్ణప్రియ 21–12, 21–14తో రియా ముఖర్జీ (ఉత్తరప్రదేశ్‌)పై విజయం సాధించింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ హైదరాబాద్‌ అమ్మాయి ఆదివారం జరిగే మూడో రౌండ్‌లో చత్తీస్‌గఢ్‌కు చెందిన ఆకర్షి కశ్యప్‌తో ఆడుతుంది. తెలంగాణకే చెందిన రెండో సీడ్‌ రితూపర్ణ దాస్, ప్రమద, వైష్ణవి కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్‌లో రితూపర్ణ 21–11, 16–21, 21–10తో కనికా కన్వల్‌ (ఎయిరిండియా)పై, ప్రమద 21–17, 23–21తో పూర్ణిమ దేవి (మణిపూర్‌)పై, వైష్ణవి 24–22, 21–12తో స్నేహ రజ్వార్‌ (ఉత్తరాఖండ్‌)పై గెలిచారు.

ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయిలు సాయి ఉత్తేజిత రావు, తనిష్క్‌ కూడా మూడో రౌండ్‌లోకి చేరుకున్నారు. రెండో రౌండ్‌లో నాలుగో సీడ్‌ సాయి ఉత్తేజిత 21–7, 21–11తో విభా జితేంద్ర ప్రసాద్‌ (బిహార్‌)పై, తనిష్క్‌ 21–17, 21–15తో దీప్తి రమేశ్‌ (కర్ణాటక)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ క్రీడాకారులు సిరిల్‌ వర్మ, రాహుల్‌ యాదవ్‌ ముందంజ వేశారు. రెండో రౌండ్‌లో రాహుల్‌ 21–13, 21–13తో రూపిందర్‌ సింగ్‌ (చండీగఢ్‌)పై, సిరిల్‌ 21–11, 21–9తో పురుషోత్తం (గుజరాత్‌)పై గెలిచారు.

>
మరిన్ని వార్తలు