ఐపీఎల్‌ ఫైనల్‌; సీఎస్‌కే లక్ష్యం 179

27 May, 2018 20:55 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  179  పరుగుల లక్ష్యాన్ని  నిర్దేశించింది. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లలో కేన్‌ విలియమ్సన్‌(47; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, శిఖర్‌ ధావన్‌(26; 25 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), షకిబుల్‌ హసన్‌(23; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించారు. చివర్లో యూసఫ్‌ పఠాన్‌(45 నాటౌట్‌; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులకు తోడు, బ్రాత్‌వైట్‌(21;11 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో  6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఓపెనర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ధావన్‌-విలియమ్సన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 51 పరుగుల భాగ్వాస‍్వామ్యాన్ని సాధించిన తర్వాత ధావన్‌ రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆపై విలియమ్సన్‌-షకిబుల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్‌ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత షకిబుల్‌ హసన్‌, దీపక్‌ హుడాలు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌ 144 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. అయితే యూసఫ్‌ పఠాన్‌ ఆదుకోవడంతో సన్‌రైజర్స్‌ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. చెన్నై బౌలర్లలో ఎన్‌గిడి, కరణ్‌ శర్మ, బ్రేవో, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు