టీ20 వరల్డ్‌కప్‌: ఆ రెండు జట్లకు నో డైరక్ట్‌ ఎంట్రీ

1 Jan, 2019 16:37 IST|Sakshi

దుబాయ్‌: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది.  టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్-10లో ఉన్న ఎనిమిది జట్లు సూపర్-12 స్టేజ్‌కు నేరుగా అర్హత సాధించగా, మరో రెండు జట్లు మాత్రం గ్రూప్ స్టేజ్‌లో తలపడి ఈ రౌండ్‌కు అర్హత సాధించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31, 2018 నాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆయా జట్లు అర్హత సాధించాయి.

టాప్-10 జట్లలో పాకిస్తాన్‌, భారత్‌, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్ఘానిస్తాన్‌ జట్లు నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించగా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ రెండు జట్లు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. దాంతో శ్రీలంక, బంగ్లాదేశ్‌లు గ్రూప్ స్టేజ్‌లో మరో ఆరు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఈ ఏడాది జరిగే క్వాలిఫై రౌండ్‌లో శ్రీలంక, బంగ్లాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 2014లో చాంపియన్స్‌గా నిలిచిన శ్రీలంక నేరుగా సూపర్ 12 స్టేజ్‌కు అర్హత సాధించకపోవడంపై ఆ టీమ్ కెప్టెన్ లసిత్ మలింగ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము సూపర్‌ 12 స్టేజ్‌కు అర్హత సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు