లంకకు భారీ షాక్.. చండిమాల్‌పై నిషేధం

11 Mar, 2018 20:11 IST|Sakshi
శ్రీలంక కెప్టెన్ చండిమాల్‌

లంక ఆటగాళ్ల ఫీజులో భారీగా కోత

బంగ్లా కెప్టెన్‌ ఫీజులో 20 శాతం కోత

కొలంబో: శ్రీలంక కెప్టెన్ చండిమాల్‌పై రెండు టీ20ల నిషేధం విధించింది ఐసీసీ. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ చండిమాల్‌పై ఈ చర్య తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మేరకు తమ అధికారిక ట్వీటర్‌లో వెల్లడించింది. రిఫరీ క్రిస్ బ్రాడ్ మాట్లాడుతూ.. నిర్ణీత సమయానికి లంక బౌలర్లు నాలుగు ఓవర్లు తక్కువ వేశారని.. దీంతో మ్యాచ్ అధిక సమయం కొనసాగిందని చెప్పారు. ఐసీసీ నిబంధన 2.5.2 ప్రకారం మ్యాచ్‌లో రెండు ఓవర్లు ఆలస్యమైతే ఆటగాళ్ల ఫీజులో 10 శాతం కోత విధిస్తారు. మూడు ఓవర్లు ఆలస్యమైతే ఫీజులో 20 శాతం కోత పడుతుంది. 

అదే సమయంలో కెప్టెన్‌కు పనిష్మెంట్‌గా రెండు 2 సస్పెన్షన్ పాయింట్లు ఇస్తారు. ఇది ఓ టెస్ట్, లేక రెండు వన్డేలు, లేక రెండు టీ20ల నిషేధానికి సమానమని క్రిస్ బ్రాడ్ తెలిపారు. దీంతో ఈ నెల 12న భారత్, 16న బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20లకు దూరం కానున్నాడు. లంక ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత విధించారు. 

బంగ్లా ఆటగాళ్లకూ ‘కోత’ పడింది!
బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మమ్మదుల్లాకు సైతం మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ నిబంధన 2.5.1 ప్రకారం బంగ్లా ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 10 శాతం, కెప్టెన్ మహ్మదుల్లా మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత విధించినట్లు రిఫరీ క్రిస్ బ్రాడ్ వివరించారు. ఏడాదిలోగా మరోసారి టీ20ల్లో స్లో ఓవర్ రేటు నమోదైతే మహ్మదుల్లా మ్యాచ్ నిషేధానికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు