లండన్: ప్రపంచకప్లో ఇప్పటివరకు శ్రీలంక ప్రదర్శణ సంతృప్తికరంగానే ఉందని ఆ జట్టు సారథి దిముత్ కరుణరత్నే పేర్కొన్నాడు. తమ శక్తి మేర పోరాడతామని తెలిపాడు. తమ పరిధులు ఏంటో తెలుసని ఎవరు గుర్తుచేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక ఎన్నో ప్రతికూలతల మధ్య ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన లంకకు ఏదికలిసి రావడంలేదు. రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కాగా మరో మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. ఇక అఫ్గాన్తో మ్యాచ్లో మాత్రం పర్వాలేదనిపించింది. అయితే శనివారం డిపెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో ఈ మాజీ చాంపియన్ తలపడనుంది. ఈ నేపథ్యంలో కరుణరత్నే మీడియా సమావేశంలో మాట్లాడాడు.
‘మా బలాలు, బలహీనతలు ఏంటో మాకు తెలుసు. మా పరిధికి మించి ఆడలేము. ప్రత్యర్థి జట్లను కాపీ కొట్టి ఆడమంటే ఎలా. వారి బలాలు వేరు. మా బలాలు వేరు. ఎవరి ఆట వారికి ఉంటుంది. ఎందుకంటే భారత్ను ఉదాహరణగా తీసుకుంటే.. ఆ జట్టులో మ్యాచ్కు ఒకరిద్దరు సెంచరీలు బాదుతారు. కానీ మా జట్టులో ఏడాదికి ఒకటి, రెండు సెంచరీలు నమోదవుతాయి. టీమిండియా బౌలర్లు గంటకు 140 కిమీ వేగంతో బౌలింగ్ చేయగల సమర్థులు. మరి మా జట్టులో 135 కిమీకి మించి బౌలింగ్ చేయలేరు. టీమిండియా ఓపెనర్లు ఎవరు, ఏంటి, ఎక్కడ అని చూడకుండా హిట్టింగ్ చేయగలరు. కానీ మాతో అది సాధ్యం అవతుందా?. అందుకే మా శక్తి మేరకు ఆడుతాము. అంతకు మించి ఆడే సత్తా లేదు’అంటూ కరుణరత్నే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
చదవండి:
‘ఆ ఫైనల్ ఫలితాన్ని రిపీట్ చేద్దాం’
పాక్ మీకు కావాల్సిన కప్ ఇదే: పూనమ్ ఫైర్