#మీటూ : మలింగా నాతో అసభ్యంగా..!

11 Oct, 2018 15:05 IST|Sakshi

క్రికెటర్‌ మలింగా భాగోతం బయట పెట్టిన చిన్మయి

సాక్షి, హైదరాబాద్‌: మీటూ ఉద్యమ నేపథ్యంలో ఇప్పటి వరకు సినీ, మీడియా రంగాల్లోని ప్రముఖుల వ్యక్తిత్వం బయటపడగా.. ఇప్పుడు ఆ సెగ క్రీడారంగానికి కూడా తగిలింది. నిన్ననే శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని  ఓ ఎయిర్‌హోస్టెస్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశ మరో స్టార్‌ క్రికెటర్‌ లసిత్‌ మలింగాపై ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి.  మీటూ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. బయటకు రాలేని మహిళల గొంతుకగా నిలుస్తున్న టాలీవుడ్‌ సింగర్‌ చిన్మయి.. మలింగా బాగోతాన్ని బయటపెట్టింది.  మలింగ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ బాధితురాలు తన గోడును చిన్మయికి షేర్‌ చేయగా ఆమె ట్వీటర్‌ వేదికగా బయటి ప్రపంచానికి తెలియజేసింది.

‘కొన్నేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో నాకు చేధు అనుభవం ఎదురైంది. ఆ హోటోల్లో నా స్నేహితురాలితో కలిసి బస చేసాను. అది ఐపీఎల్‌ సీజన్‌ కావడంతో శ్రీలంక ఫేమస్‌ క్రికెటర్‌ మలింగా కూడా అదే హోటల్లో బస చేశారు.  ఒకరోజు నా స్నేహితురాలి కోసం ఎదురు చూస్తుంటే మలింగా తన రూంలో ఉందని చెప్పాడు. దీంతో నేను ఆ గదిలోకి వెళ్లగా అక్కడ ఆమె లేదు. మలింగా మాత్రం వెనుక నుంచి నన్ను బెడ్‌పైకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించాడు. నా ఫేస్‌ను తడిమాడు. అతనితో పోటీపడి నాకు నేను రక్షంచుకోలేనని గ్రహించాను. ఏం చేయలేక కళ్లు మూసుకుని నిశబ్దంగా ఉండిపోయాను.

అప్పుడు హోటల్‌ సిబ్బంది డోర్‌ కొట్టారు. దీంతో అతను వెళ్లి డోర్‌ తీశాడు. నేను వెంటనే వాష్‌ రూంకు వెళ్లి నా ఫేస్‌ను కడుక్కున్నాను. హోటల్‌ సిబ్బంది బయటకు వెళ్లే లోపే ఆ రూం నుంచి బయటపడ్డాను. ఇది నాకు చాలా అవమానకరంగా అనిపించింది. నాకు తెలిసిన కొంత మందికి ఈ విషయం చెబితే.. వారు తప్పంతా నాదే అన్నట్లు మాట్లాడారు. నీవే అతని రూంకు వెళ్లావని, అదికాక అతనో ఫేమస్‌ క్రికెటరని, కావాలనే ఇలాచేశావంటారని తెలిపారు’ అని సదరు యువతి తన గోడును చిన్మయికి వెళ్ళబోసుకుంది.

చదవండి: #మీటూ : ‘ఆ మాజీ క్రికెటర్‌ నీచుడు’ 

>
మరిన్ని వార్తలు