ఆ ఓటమి గాయం బాధిస్తోంది: బట్లర్‌

22 Jun, 2019 15:45 IST|Sakshi

లీడ్స్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శుక్రవారం శ్రీలంక చేతిలో పరాజయం చెందడం పట్ల ఇంగ్లండ్‌ బ్యాట్సమన్‌ జోస్‌ బట్లర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీలంకపై ఓటమి మమ్మల్ని తీవ్రంగా కలచి వేసిందన్నాడు. బ్యాటింగ్‌లో వైఫల్యం చెందడం వల్లే మ్యాచ్‌ను చేజార్చుకున్నామన్నాడు. ఆ ఓటమి గాయం తమ జట్టును బాధిస్తోందన్నాడు.‘ మేము బ్యాటింగ్‌లో చెత్త ప్రదర్శన చేశాం. మా పూర్తి స్థాయి ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాం. ఏ దశలోనూ బౌలర్లపై ఒత్తిడి తీసుకు రాలేకపోయాం. ప్రధానంగా స్టైక్‌ రొటేట్‌ చేయడంలో ఇబ్బంది పడ్డాం. ఇక్కడ నా ఉద్దేశం ఫోర్లు, సిక్సర్లు కొట్టమని కాదు. సమిష్టిగా రాణించడంలో వైఫల్యం కనబడింది. ఇది మా అత్యుత్తమ ప్రదర్శన ఎంతమాత్రం కాదు. జేసన్‌ రాయ్‌ లేకపోవడం కూడా మా ఓటమిపై ప్రభావం చూపింది. (ఇక్కడ చదవండి: లంక వీరంగం)

ఈ ఓటమి ప్రభావం కొన్ని రోజుల వరకూ ఉంటుంది. కాకపోతే తదుపరి మ్యాచ్‌లకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడమే మా లక్ష్యం. శ్రీలంక విజయం క్రెడిట్‌ అంతా లసిత్‌ మలింగాదే. అతనొక నాణ్యమైన బౌలర్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. అతనొక అసాధారణ బౌలర్‌. బ్యాట్స్‌మెన్‌ ప్యాడ్లే లక్ష్యంగా మలింగా బంతులు వేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. అతన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయాం’ అని బట్లర్‌ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌పై శ్రీలంక 20 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.  శ్రీలంక 233 పరుగుల సాధారణ టార్గెట్‌ను కాపాడుకుని ఇంగ్లండ్‌పై సూపర్‌ విక్టరీ సాధించింది.


 

>
మరిన్ని వార్తలు