శ్రీలంక కొత్త చరిత్ర

23 Feb, 2019 15:36 IST|Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: శ్రీలంక క్రికెట్‌ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన లంకేయులు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. శనివారం ముగిసిన రెండో టెస్టులో శ్రీలంక ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక రికార్డు నెలకొల్పింది.(ఇక్కడ చదవండి: కుశాల్ కౌశ‌లం)

తాజా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని లంకేయులు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఒషాడో ఫెర్నాండ్‌(75 నాటౌట్‌), కుశాల్‌ మెండిస్‌(84 నాటౌట్‌)లు లంక విజయంలో ముఖ్య భూమిక పోషించారు. వీరిద్దరూ 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో లంక ఘన విజయం నమోదు చేసింది. నాల్గో ఇన్నింగ్స్‌లో శ్రీలంకకు ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. 60/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక మరో వికెట్‌ కోల్పోకుండా జయకేతనం ఎగురవేసింది. డర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఒక వికెట్‌ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 154 ఆలౌట్‌, రెండో  ఇన్నింగ్స్‌ 197/2

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 222 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌  128 ఆలౌట్‌

మరిన్ని వార్తలు