నడవలేని స్థితిలో జయసూర్య..!

6 Jan, 2018 13:30 IST|Sakshi

సనత్ జయసూర్య... శ్రీలంక మాజీ కెప్టెన్‌గానే కాకుండా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న వ్యక్తిగా అందరికీ తెలుసు. ఒకానొక సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు చుక్కలు చూపించిన జయసూర్య ఇపుడు అనారోగ్యంతో ఎవరూ ఊహించని రీతిలో బాధపడుతున్నాడు. మోకాలి గాయం కారణంగా జయసూర్య నడవలేని స్థితిలో ఉన్నాడు. స్ట్రెచర్స్‌ లేనిదే జయసూర్య అడుగులు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం జయసూర్య త్వరలో ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. మెల్‌బోర్న్‌లో ఆయన మోకాలికి ఆపరేషన్‌ చేయించుకోనున్నాడు. శస్త్రచికిత్స అనంతరం జయసూర్య కోలుకోవడానికి కనీసం నెలరోజుల సమయం పడుతుందని.. అప్పటి వరకు ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు. 

శ్రీలంక క్రికెట్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్‌ ఆటగాడైన జయసూర్య.. తన కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. టెస్టుల్లో 6973 పరుగులు, 98 వికెట్లతో ఆల్‌ రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన జయసూర్య వన్డేల్లో 13430 పరుగులు, 323 వికెట్లు పడగొట్టాడు.  టీ20 ల్లో అతను 629 పరుగులు చేసి 19 వికెట్లు తీసుకున్నాడు. 1996లో శ్రీలంక వరల్డ్‌ కప్‌ గెలవడంలో జయసూర్య కీలక పాత్ర వహించాడు. శ్రీలంక క్రికెట్ బోర్డుకు  జయసూర్య రెండుసార్లు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగాడు. అయితే 2017 లో సౌతాఫ్రికా, భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో లంక జట్టు పేలవమైన ప్రదర్శన కనబర్చడంతో జయసూర్య సెలెక్షన్ కమిటీ చైర్మన్‌ పదవికి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు