మీర్పూర్: ఆసియా కప్లో వరుస విజయాలతో జోరు మీదున్న శ్రీలంక తుది సమరంలోనూ సత్తాచాటింది. శనివారం జరిగిన ఫైనల్లో లంక ఐదు వికెట్లతో పాకిస్థాన్ను అలవోకగా చిత్తుచేసి ట్రోఫీని సొంతం చేసుకుంది. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు మరో 22 బంతులు మిగిలుండగానే ఐదు వికెట్ల నష్టానికి విజయతీరాలకు చేరింది. లంక ఓపెనర్ తిరుమన్నె (101) సెంచరీతో పాటు పేసర్ మలింగ (5/56) సూపర్ స్పెల్తో చెలరేగి లంకకు విజయాన్నందించారు.
తిరుమన్నెతో పాటు మరో ఓపెనర్ కుశాల్ పెరెరా (42) జట్టుకు శుభారంభం అందించారు. కాగా పెరెరా, సంగక్కరను సయీద్ అజ్మల్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఈ దశలో తిరుమన్నె, మహేల (75) జట్టును ఆదుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్కు 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశారు. గెలుపు ముంగిట సెంచరీ హీరో తిరుమన్నె వెనుదిరిగినా, మాథ్యూస్ (16 నాటౌట్), చతురంగ డిసిల్వా (6 నాటౌట్) లాంఛనం పూర్తిచేశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పాక్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 260 పరుగులు చేసింది. పాకిస్తాన్ను లంక పేసర్ మలింగ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లు షార్జీల్ ఖాన్ (8), అహ్మద్ షెహ్జాద్(5) వికెట్లను వెంట వెంటనే చేజార్చుకోవడంతో పాక్ కు కష్టాలు ఆరంభమైయ్యాయి. అనంతరం వచ్చిన మహ్మద్ హఫీజ్ కూడా(3) పరుగులకే పెవిలియన్ కు చేరడంతో పాక్ నిరాశకు లోనైంది. ఆ తరుణంలో మిస్బావుల్ -హక్, ఫావద్ అలాంలు పాక్ ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టారు.
పాకిస్తాన్ కుదుటపడే సమయంలో మిస్బావుల్ (65) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అప్పటికే క్రీజ్ లో పాతుకుపోయిన అలాం (114)పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా ఉన్న ఉమర్ అక్మల్ (59) పరుగులు చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 260 పరుగుల గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. లీగ్ మ్యాచ్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి పాకిస్తాన్ ను కట్టడి చేసిన మలింగా మరోమారు చక్కటి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసి పాక్ వెన్నవిరిచాడు. శ్రీలంక ఖాతాలో చేరిన ఐదు వికెట్లు మలింగాకే దక్కడం ఈ మ్యాచ్ లో విశేషం.