ఆఖరి వన్డేలోనూ అదుర్స్‌

26 Jul, 2019 23:15 IST|Sakshi

కొలొంబో : ‘శుక్రవారం నేను ఆఖరి వన్డే ఆడబోతున్నాను. మీకు వీలైతే వచ్చి మ్యాచ్‌ చూడండి’... అంటూ  తన అభిమానులను ప్రేమదాస స్టేడియానికి ఆహ్వానించిన లసిత్‌ మలింగ అన్నట్లుగానే తన చివరి మ్యాచ్‌లో సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌ చివరి వికెట్‌ను తీసి శ్రీలంకను గెలిపించాడు. బంగ్లాదేశ్‌ ఆటగాడు ముస్తాఫిజర్‌ను ఔట్‌ చేయడంద్వారా మొత్తంగా 338 వికెట్లు తన ఖాతాలో వేసుకొని అంతర్జాతీయ వన్డే క్రికెట్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. కాగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో మొదట బ్యాటింగ్‌చేసిన శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు సాధించింది. చేజింగ్‌లో బంగ్లాదేశ్‌ 41.4 ఓవర్లకు 223 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. మలింగ 9.4 ఓవర్లు వేసి కేవలం 38 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 

మ్యాచ్‌ తర్వాత మలింగ మాట్లాడుతూ ‘ రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇదే సరైన సమయంగా భావించా. 15 సంవత్సరాలుగా శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉందని, నా కెరీర్‌ను ఘనంగానే ముగించానని అనుకుంటున్నానని’  పేర్కొన్నాడు. టి20 క్రికెట్‌లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.   
 

మరిన్ని వార్తలు