ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోది..

11 Jun, 2019 18:46 IST|Sakshi

బ్రిస్టల్‌: వన్డే వరల్డ్‌కప్‌ను వర్షం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా రద్దయ్యింది. భారీ వర్షం పడటంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. దాంతో వరల్డ్‌కప్‌లో మూడో మ్యాచ్‌ వర్షార్పణం అయ్యింది. వారం వ్యవధిలో మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.

భారత కాలమాన ప్రకారం సాయంత్రం గం. 6.30ని.లకు మ్యాచ్‌ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలుమార్లు పిచ్‌ను, ఔట్‌ ఫీల్డ్‌ను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ జరపడం సాధ్యం కాదని తేల్చారు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫలితంగా ఇరు జట్లకు తలో పాయింట్‌ కేటాయించారు. మ్యాచ్‌ రద్దయిన తర్వాత శ్రీలంక నాలుగు  పాయింట్లతో ఉండగా, బంగ్లాదేశ్‌ మూడు పాయింట్లతో ఉంది. ఈ మెగా టోర్నీలో శ్రీలంక-బంగ్లాలు తలో మ్యాచ్‌ మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. కాగా, పాకిస్తాన్‌తో శ్రీలంక ఆడాల్సిన మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది.


 

మరిన్ని వార్తలు