శశాంక్‌ భారత క్రికెట్‌ను దెబ్బతీశారు!

3 Jul, 2020 00:21 IST|Sakshi

శ్రీనివాసన్‌ తీవ్ర విమర్శ

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు వ్యవహరించిన శశాంక్‌ మనోహర్‌ భారత్‌ క్రికెట్‌ను బాగా దెబ్బతీశారని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌ దుయ్యబట్టారు. భారతీయుడై ఉండి తన గొప్పల కోసం మన బోర్డు ప్రయోజనాలకు వ్యతిరేకిగా పనిచేశారని ఆరోపించారు. తను ఎలాగూ మళ్లీ బీసీసీఐలో క్రీయాశీలం కాలేనని భావించే... చేయాల్సిన నష్టమంతా చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ‘నేను కచ్చితంగా చెప్పగలను... శశాంక్‌ బీసీసీఐ ప్రతిష్టను భ్రష్టు పట్టించారు. పలుకుబడిని పాతాళానికి తీసుకెళ్లారు. బోర్డు, భారత ప్రయోజనాలకు పాతరేశారు. ఇలాంటి వ్యక్తి పదవి నుంచి దిగిపోవడం ఇప్పుడు ప్రతి భారత క్రికెట్‌ అధికారికి సంతోషం కలిగించే అంశం. ఆయన భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసి ఒకప్పుడు ఐసీసీని శాసించే స్థితిలో ఉన్న బీసీసీఐని ఇప్పుడు ప్రాముఖ్యత లేకుండా చేశారు. చెప్పుకోలేనంత నష్టాలెన్నో చేసి అన్ని రకాలుగా బోర్డుకు కీడు తలపెట్టారు’ అని శ్రీనివాస్‌ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసన్‌ వ్యాఖ్యలతో మాజీ కార్యదర్శి నిరంజన్‌ షా కూడా ఏకీభవించారు.

మరిన్ని వార్తలు