చక్రం తిప్పుతున్న శ్రీనివాసన్!

24 Sep, 2015 00:57 IST|Sakshi
చక్రం తిప్పుతున్న శ్రీనివాసన్!

న్యూఢిల్లీ : ఏడు నెలల వ్యవధిలోనే బీసీసీఐలో మరో సారి రాజకీయం రాజుకుంది. దాల్మియా మృతితో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని చేజిక్కించుకునేందుకు బోర్డులోని రెండు వర్గాలు వ్యూహా ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ తన మద్దతుదారులతో గురువారం బెంగళూరులో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహం అనుసరించాలి, అభ్యర్థి ఎవరు అనే అంశాలను ఇందులో చర్చించనున్నారు. తనకు ఈ సమావేశం కోసం పిలుపు వచ్చినట్లు ఒక సీనియర్ సభ్యుడు ధ్రువీకరించారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న అమితాబ్ చౌదరి కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది.

ఈస్ట్‌జోన్ సంఘాలతో పాటు తనకు అనుకూలురైన సౌత్‌జోన్ సంఘాలనుంచి కూడా శ్రీని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికలపై చర్చించేందుకు శ్రీనివాసన్ నాగపూర్‌లో శరద్‌పవార్‌తో కూడా సమావేశమైనట్లు తెలిసింది. ఇక రాజకీయాల్లో భిన్న ధ్రువాలే అయినా రాజీవ్ శుక్లాను అధ్యక్షుడిని చేసేందుకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈస్ట్‌జోన్ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు తెలిసింది.

>
మరిన్ని వార్తలు