విజేత సెయింట్ జాన్స్ అకాడమీ

28 Apr, 2014 01:48 IST|Sakshi

ఇంటర్ అకాడమీ చాలెంజర్ ట్రోఫీ
 సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి అండర్-14 ఇంటర్ అకాడమీ క్రికెట్ చాలెంజర్ ట్రోఫీలో నగరానికి చెందిన సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ జట్టు విజేతగా నిలిచింది. తమిళనాడులోని తిరుప్పూరులో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సెయింట్ జాన్స్ 76 పరుగుల భారీ తేడాతో తిరుప్పూరు స్కూల్ ఆఫ్ క్రికెట్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ జాన్స్ నిర్ణీత 30 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ప్రగున్ దూబే (50) అర్ధ సెంచరీ చేయగా, వైష్ణవ్ రెడ్డి 25 పరుగులు సాధించాడు.
 
 తిరుప్పూరు బౌలర్ రోహన్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తిరుప్పూరు స్కూల్ 75 పరుగులకే కుప్పకూలింది. సెయింట్ జాన్స్ బౌలర్లు రిషభ్ బస్లాస్ (2/9), సిద్ధార్థ్ నాయుడు (2/10) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో ‘ఎ’ గ్రూప్‌లో సెయింట్ జాన్స్ ఆడిన 3 మ్యాచ్‌లూ నెగ్గి అజేయంగా నిలవడం విశేషం. సెమీఫైనల్లో ఈ జట్టు 104 పరుగుల తేడాతో ముత్తూట్ క్రికెట్ అకాడమీ (కొచ్చి)ని చిత్తు చేసింది. ఈ అకాడమీకి చెందిన సిద్ధార్థ్ నాయుడు (బెస్ట్ బ్యాట్స్‌మన్), రిషభ్ బస్లాస్ (బెస్ట్ బౌలర్), ప్రియాన్షు జైన్ (ప్రామిసింగ్ బౌలర్), ప్రగున్ దూబే (బెస్ట్ కీపర్) వ్యక్తిగత విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నారు.
 

మరిన్ని వార్తలు