సెయింట్ జోన్స్ గెలుపు

19 Apr, 2014 00:12 IST|Sakshi

ఇంటర్ స్టేట్ కోకాకోలా కప్
 ముంబై: కోకాకోలా ఇంటర్ స్టేట్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన సెయింట్ జోన్స్ కాలేజి తొలి విజయం నమోదు చేసింది. బరోడాకు చెందిన శ్రేయాస్ సమర్పణ్ విద్యాలయ్‌తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెయింట్ జోన్స్ 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ జోన్స్ 45 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 177 పరుగులు చేసింది.
 
 గిరీష్ గౌర్ (70 బంతుల్లో 47; 3 ఫోర్లు), శిరీష్ గౌర్ (40 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), మికిల్ జైస్వాల్ (37 బంతుల్లో 36; 3 ఫోర్లు) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించారు. శ్రేయాస్ సమర్పణ్ బౌలర్లలో హేమంత్ పండే (2/26), విజయ్ చౌహాన్ (2/31)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం శ్రేయాస్ సమర్పణ్ జట్టు 41.3 ఓవర్లలోనే 170 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యుసింగ్ రాజ్‌పుత్ (101 బంతుల్లో 80; 12 ఫోర్లు) అద్భుతంగా ప్రదర్శన కనబరిచినా.. ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి అతనికి సహకారం దక్కలేదు. సెయింట్ జోన్స్ బౌలర్లు అభిషేక్ సింగ్ (2/19), రాజ్ మణి(2/32)లు చెరో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశారు. నిలకడైన బ్యాటింగ్‌తో సెయింట్ జోన్స్ ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించిన గిరీష్ గౌర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

మరిన్ని వార్తలు