సెయింట్ మార్టిన్స్ గెలుపు

14 Feb, 2014 00:21 IST|Sakshi

జింఖానా, న్యూస్‌లై న్: బీఎఫ్‌ఐ-ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో సెయింట్ మార్టిన్స్ జట్టు 38-31తో బిట్స్ పిలాని జట్టుపై నెగ్గింది. సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే మ్యాచ్ మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 12-7తో సెయింట్ మార్టిన్స్ ముందంజలో ఉంది.
 
 అనంతరం రెండో అర్ధ భాగంలో బిట్స్ పిలాని ప్లేయర్లు... ప్రత్యర్థిని ఎదుర్కునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ సెయింట్ మార్టిన్స్ క్రీడాకారిణులు మనీషా (17), దివ్యవాణి (10), ఐశ్వర్య (8)ల జోరును మాత్రం అడ్డుకోలేకపోయారు. బిట్స్ పిలాని జట్టులో మేహ (14), అపూర్వ (10) రాణించారు. మరో మ్యాచ్‌లో సీవీఎస్‌ఆర్ కాలేజి 40-28తో గోకరాజు రంగరాజు కాలేజిపై విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచి సీవీఎస్‌ఆర్ క్రీడాకారిణులు ప్రత్యూష (18), శ్రేష్ఠ (15) దూకుడును ప్రదర్శించారు.
 
  గోకరాజు రంగరాజు జట్టు సభ్యులు సీవీఎస్‌ఆర్‌ను ప్రతిఘటించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ చివరి వరకు సీవీఎస్‌ఆర్ అమ్మాయిలు అదే  ఆటతీరును కొనసాగించి విజయాన్ని దక్కించుకున్నారు. గోకరాజు రంగరాజు జట్టులో మృణాళిని (18) చక్కని ప్రతిభ కనబరిచింది.
 
 ఇతర ఫలితాలు
 పురుషుల విభాగం:
 బిట్స్ పిలాని: 30 (ఇషాన్ 16, కాకా 10); సీవీఎస్‌ఆర్ కాలేజి: 20 (జెన్ని 6, ఫైజల్ 6).
 ఏవీ కాలేజి: 51 (శామ్సన్ 20, బాలాజి 14, సాయి 13); అవంతి డిగ్రీ కాలేజి: 37 (జశ్వంత్ 17, అక్రమ్ 11).
 

మరిన్ని వార్తలు