బ్యాడ్మింటన్‌కు దూరంగా ఉండండి

31 Jul, 2013 01:41 IST|Sakshi

 న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ అజహర్ అధ్యక్షుడిగా ఉన్న ఢిల్లీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (డీబీఏ)కు, వైరి వర్గం ఢిల్లీ క్యాపిటల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ (డీసీబీఏ) మధ్య వివాదం ముదురుతోంది. తన సంఘానికి ‘బాయ్ ’గుర్తింపు ఇవ్వాలంటూ అజహర్ చేసిన వ్యాఖ్యపై డీసీబీఏ అధ్యక్షుడు దీపక్ తన్వర్ తీవ్రంగా స్పందించారు. అసలు ఏ సంఘానికి గుర్తింపు ఇవ్వాలో చెప్పేందుకు అజహర్ ఎవరంటూ ప్రశ్నించారు.
 
 ‘డీసీబీఏకు భారత ఒలింపిక్ సంఘం సహా అన్ని వైపులనుంచి గుర్తింపు ఉంది. ఎవరికి గుర్తింపు ఇవ్వాలో చెప్పేందుకు అజహర్ ఎవరు? ఇతర సంఘాల పనితీరు గురించి ఆయనకు అసలు ఏమీ తెలీదు. గత ఏడాది అనుభవం తర్వాత కూడా అజహర్ మళ్లీ బ్యాడ్మింటన్‌లోకి అడుగు పెట్టాలని ఎందుకు అంతగా ప్రయత్నిస్తున్నారు. దీనిని వదిలి ఆయన తన సొంత ఆట (క్రికెట్)పై దృష్టి పెడితే బాగుంటుంది’ తన్వర్ వ్యాఖ్యానించారు.
 

>
మరిన్ని వార్తలు