కోహ్లీ మీద పడి ఏడుస్తున్నాడుగా...

19 Sep, 2017 12:46 IST|Sakshi
కోహ్లీ మీద పడి ఏడుస్తున్నాడుగా...
సాక్షి, స్పోర్ట్స్‌: మొదటి వన్డే ఓటమి అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. మీడియా సమావేశంలో ఓటమికి కారణాలు చెబుతూనే.. మరోపక్క టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వన్డే వ్యక్తిగత రికార్డుల గురించి స్మిత్‌ నోరు జారాడు. 
 
‘టీమిండియా మా జట్టు కంటే ఎక్కువ వన్డేలు ఆడిన అనుభవం ఉంది. కోహ్లీ ఎన్ని ఆటలు ఆడి ఉంటాడో నాకు సరిగ్గా తెలీదు. కానీ, నేను మాత్రం వ్యక్తిగత రికార్డుల కోసం పాకులాడను. కేవలం మా జట్టు గెలుపు కోసమే ఆడతా. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌ను గెలవాలనే ప్రయత్నిస్తున్నా’ అని స్మిత్ చెప్పాడు. అంతే ఇక ఈ మాటలపై సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కోహ్లీ రికార్డులను, విజయాలను తట్టుకోలేకనే స్మిత్ ఇలాంటి చౌవకబారు కామెంట్లు చేస్తున్నాడని వారంటున్నారు. 
 
అయితే సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్‌ కోహ్లీ తనకు జట్టు విజయాలే ముఖ్యమని స్టేట్‌మెంట్‌ ఇవ్వటం తెలిసిందే. తృటిలో సెంచరీలు చేజారినా తాను బాధపడనని.. జట్టు విజయం సాధిస్తే అంతే చాలని కోహ్లీ తెలిపాడు. కెరీర్‌లో ఇప్పటిదాకా మొత్తం 195 వన్డేలు ఆడిన కోహ్లీ 30 సెంచరీలు చేయగా, 99 వన్డేలు ఆడిన స్టీవ్‌ స్మిత్‌ ఖాతాలో 8 సెంచరీలు ఉన్నాయి.
>
మరిన్ని వార్తలు