జడేజాను ఎదుర్కొవడం కష్టం: స్మిత్‌

8 Apr, 2020 16:06 IST|Sakshi

హైదరాబాద్‌: ఉపఖండపు పిచ్‌లపై టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ఎదుర్కొవడం చాలా కష్టమని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ సారథి అయిన స్మిత్‌ తన సహచర ఆటగాడు ఇష్‌ సోదితో లైవ్‌ చాట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను స్మిత్‌ వెల్లడించాడు. భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడం ప్రస్తుతం తనకున్న ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు.

‘ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ప్రపంచకప్‌, యాషెస్‌ నాకు పెద్ద విజయాలు. కానీ టెస్టుల్లో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న టీమిండియాను వారి గడ్డపై ఓడించాలనేది ప్రస్తుతం తనకున్న లక్ష్యం. అయితే అది అంత సులువు కాదన్న విషయం తెలుసు. ఇక క్రికెట్‌లో ఆటగాడిగా ఒకటి లేక అనేక లక్ష్యాలంటూ ఉండవు. రోజుకు రోజు, సిరీస్‌కు సిరీస్‌లో ఆటగాడిగా మెరుగుపడటంతో పాటు జట్టు గెలవాలని కోరుకుంటున్నా. ఇక ఉపఖండపు పిచ్‌లలో ముఖ్యంగా భారత్‌లో రవీంద్ర జడేజాను ఎదుర్కొవడం కష్టం. అతడు బంతిని రిలీజ్ చేసే తీరు ఒకే విధంగా ఉన్నా వైవిద్యభరితంగా దూసుకొస్తుంది. వేగంలో మార్పు లేకున్నా చేతివేళ్లతో బంతి గమనాన్ని మార్చుతాడు. అందుకే అతడి బౌలింగ్‌లో ఆడటం కష్టం.

ఇక చాలా కొద్ది మందికే తెలుసు నేను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఆసీస్‌ జట్టులోకి వచ్చానని. షేన్‌ వార్న్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ 12,13 మంది స్పిన్నర్లును ప్రయత్నించింది. అందులో నేనూ ఒకరిని. రెండు టెస్టులు ఆడిన తర్వాత ఆసీస్‌ నుంచి ఉద్వాసనకు గురయ్యాను. ఈ సమయంలో స్పిన్నర్‌గా వర్కౌట్‌ కాదని బ్యాటింగ్‌పై ఫోకస్‌ పెట్టాను’అని స్టీవ్‌ స్మిత్‌ పేర్కొన్నాడు. 

>
మరిన్ని వార్తలు