‘ఔట్‌ చేయడానికో, గాయపరచడానికో తెలీదు’

26 Jun, 2020 17:19 IST|Sakshi

ఆంబ్రోస్‌పై స్టీవ్‌ వా ప్రశంసలు

అతనొక అసాధారణ ప్రత్యర్థి

మెల్‌బోర్న్‌: వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ కర్ట్‌లీ ఆంబ్రోస్‌తో జరిగిన ఒకనాటి పోరు గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా మరొకసారి గుర్తు చేసుకున్నాడు. 1995లో వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా జమైకాలో జరిగిన టెస్టు సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆంబ్రోస్‌తో ఫైట్‌ను స్టీవ్‌ వా వెల్లడించాడు.  ఆ మ్యాచ్‌లో స్టీవ్‌ వా డబుల్‌ సెంచరీ సాధించి ఒక అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో కెరీర్‌కు బాటలు వేసుకోగా, ఆంబ్రోస్‌ లాంటి బౌలర్‌ను ఎదురొడ్డి నిలవడం సవాల్‌గా అనిపించిందన్నాడు. ‘ రెండు టెస్టులు ముగిసే సరికే సిరీస్‌ సమంగా ఉండటంతో మూడో టెస్టుకు ప్రాధాన్యత ఏర్పడింది. చివరి టెస్టు కోసం మార్క్‌ టేలర్‌ నేతృత్వంలోని మా జట్టు జమైకాకు వెళ్లింది. ఆ మ్యాచ్‌కు ముందు అప్పటి కోచ్‌ బాబ్‌ సింప్సన్‌ మాటలు మాలో ప్రేరణ కల్గించాయి. కానీ సమావేశం మధ్యలో నేను దూరంగా వెళ్లిపోయా. (‘ఆ ఇద్దరే సిరీస్‌ స్వరూపాన్ని మార్చేశారు’)

నేను ఏదో చేయాలనిపించింది. సాధ్యమైనంత ఎక్కువ స్కోరు సాధించాలి అనుకున్నా. అందుకోసం పోరాటం చేయాల్సిందేనని నిశ్చయించుకున్నా. కానీ ఆంబ్రోస్‌ వంటి బౌలర్‌ను ఆడటంపై గురి పెట్టా. ఆంబ్రోస్‌ ఒక గొప్ప బౌలర్‌. అతని గురించి చెప్పడానికి మాటలు చాలవు. అసాధారణ బౌలర్‌. ఒక గొప్ప ప్రత్యర్థి. అతని నుంచి బంతులు దారుణంగా ఉంటాయి. స్లెడ్జింగ్‌ కంటే అతని బంతులే ప్రమాదం. అతను ఏమి ఆలోచిస్తున్నాడో మనకు తెలీదు. నన్ను ఔట్‌ చేసేందుకు బంతులు వేస్తున్నాడా.. లేక గాయపరిచేందుకు వేస్తున్నాడా అనేది తెలీదు. వర్ణించడానికి వీలుకాని ప్రత్యర్థి ఆంబ్రోస్‌. ఇక నా ఇన్నింగ్స్‌ విషయానికొస్తే వెస్టిండీస్‌తో ఆ ఇన్నింగ్స్‌ నన్ను ప్లేయర్‌గా నిలబెట్టింది. ఆది బాబ్‌ సింప్సన్‌ క్రెడిట్‌. కానీ అది అతనికి దక్కదని తెలుసు. మమ్మల్ని కూర్చోబెట్టి మీలో ఒకరు భారీ సెంచరీ చేయాలి అని చెప్పిన మాటలు నన్ను ఆలోచింప  చేశాయి. అదే లక్ష్యంతో బరిలోకి దిగి డబుల్‌ సెంచరీ చేశా’ అని స్కై స్పోర్ట్స్‌ యూట్యూబ్‌ వీడియో ఇంటర్వ్యూలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ అథర్టన్‌తో విండీస్‌తో విషయాలను స్టీవ్‌ వా షేర్‌ చేసుకున్నాడు. మూడో టెస్టులో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 531 పరుగులు చేయగా, విండీస్‌ 265 పరుగులకు తొలి ఇ‍న్నింగ్స్‌లో ఆలౌట్‌ కాగా,  రెండో ఇ‍న్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటైంది. దాంతో మ్యాచ్‌ను ఇన్నింగ్స్‌ 53 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా  ఆసీస్‌ 2-1తో గెలుచుకుంది. (233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..)

మరిన్ని వార్తలు