ఐపీఎల్ వేలంపై సంచలన ఆరోపణలు

6 Sep, 2017 16:52 IST|Sakshi
ఐపీఎల్ వేలంపై సంచలన ఆరోపణలు

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో వచ్చే ఐదేళ్ల కాలానికి టెలివిజన్, డిజిటల్‌ రైట్స్‌ను భారీ మోత్తానికి స్టార్ ఇండియా సంస్థ సొంతం చేసుకుంది. అయితే స్టార్ ఇండియాకు ఐపీఎల్ మీడియా హక్కులు రావడంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. సోమవారం నిర్వహించిన వేలంలో రూ. 16 వేల 347.50 కోట్ల భారీ మొత్తానికి స్టార్‌ ఇండియా సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకోగా.. ఆ సంస్థకు మీడియా హక్కులు రావడంలో బీసీసీఐతో పాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా హస్తముందని.. అందుకుగానూ ఆయన రూ. 100 కోట్లు అందుకోనున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇంటర్నల్ ఆర్బిటరీ అప్లికేషన్ రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
సోమవారం నిర్వహించిన వేలంలో నిబంధనల ప్రకారం సీల్డ్‌ కవర్‌లో అత్యధిక బిడ్‌ వేసిన గ్రూప్‌నకు బీసీసీఐ హక్కులను కేటాయించింది. ఉపఖండంలో టెలివిజన్‌ హక్కుల కోసం స్టార్‌తో పోటీ పడిన సోనీ సంస్థ ఈసారి అవకాశం కోల్పోయింది. కొత్త ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు స్టార్‌కు ఈ హక్కులుంటాయి. 2008లో తొలి ఐపీఎల్‌ సమయంలో పదేళ్ల కాలానికి హక్కులను వరల్డ్‌ స్పోర్ట్స్‌ గ్రూప్‌ దాదాపు రూ. 8,200 కోట్లు సొంతం చేసుకుంది. మరుసటి ఏడాది తొమ్మిదేళ్ల కాలానికి సోనీ గ్రూప్‌నకు 1.63 బిలియన్‌ డాలర్లకు అమ్మేసింది.

ఐపీఎల్ బిడ్‌లో అసలేం జరిగింది..
మొత్తం ఏడు కేటగిరీల్లో ఐపీఎల్‌ హక్కుల కోసం బీసీసీఐ బిడ్‌లను ఆహ్వానించింది. మొత్తం 24 కంపెనీలు బిడ్‌ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేసినా.. చివరకు 14 కంపెనీలే వేలంలో పాల్గొన్నాయి. భారత్‌లో టీవీ హక్కుల కోసం స్టార్‌ రూ. 6,196.94 కోట్లతో బిడ్‌ వేయగా, సోనీ రూ. 11,050 కోట్లతో బిడ్‌ చేసి ముందంజలో నిలిచింది. అయితే డిజిటల్‌ హక్కుల కోసం రూ. 1,443 కోట్లతో పాటు మిగతా ఐదు కేటగిరీ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెస్టాఫ్‌ వరల్డ్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా)లకు కూడా స్టార్‌ బిడ్‌ వేయగా... సోనీ మాత్రం మరే ఇతర కేటగిరీలోకి అడుగే పెట్టలేదు. ఓవరాల్‌గా గ్లోబల్‌ బిడ్‌కే హక్కులు కేటాయించాల్సి రావడంతో స్టార్ ఇండియా ఐపీఎల్ హక్కులు దక్కించుకుంది.

మరిన్ని వార్తలు