ప్రిక్వార్టర్స్‌లో సుమిత్, వికాస్

21 Oct, 2013 01:14 IST|Sakshi
ప్రిక్వార్టర్స్‌లో సుమిత్, వికాస్

అల్మాటీ (కజకిస్థాన్): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మరో ఇద్దరు భారత బాక్సర్లు ముందంజ వేశారు. ఒలింపియన్ సుమిత్ సంగ్వాన్ (81 కేజీలు), వికాస్ మాలిక్ (60 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. దీంతో ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించిన భారత బాక్సర్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. మన్‌దీప్ జాంగ్రా (69 కేజీ) పరాజయం చవిచూశాడు.
 
 
 ఆదివారం ఇక్కడ జరిగిన పోటీల్లో సుమిత్ 2-1తో తొమ్మిదో సీడ్ పెట్రూ సియోబను (మాల్దోవా)కు షాకిచ్చాడు. ప్రతి రౌండ్‌లోనూ చక్కని ఆధిపత్యం కనబరిచిన భారత బాక్సర్ చివరి రౌండ్లో మాత్రం పాయింట్ వెనుకబడ్డాడు. చివరకు 30-27, 30-27, 28-29తో ప్రత్యర్థిపై జయకేతనం ఎగరవేశాడు. మరో పోరులో వికాస్ 2-1తో పొలండ్‌కు చెందిన డేవిడ్ మిచెలస్‌పై గెలుపొందాడు. ఈ బౌట్‌లో విజయం కోసం ఇద్దరు హోరాహోరీగా  తలపడ్డారు. దీంతో రెండు రౌండ్లలో స్కోరు టై అయింది. అయితే ఒక రౌండ్‌లో భారత బాక్సర్ ఆధిక్యం కనబరచడంతో 2-1తో గెలిచినట్లు జడ్జీలు ప్రకటించారు.
 
  వికాస్ 28-28, 29-27, 28-28తో గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో ఇతను ఐదో సీడ్ మిక్లోస్ వర్గా (హంగేరి)తో, సుమిత్... ఎనిమిదో సీడ్ సియర్హే నొవికవూ (బెలారస్)తో తలపడతారు. మన్‌దీప్... సెర్దార్ హుదమెర్డియెవ్ (తుర్క్‌మెనిస్థాన్) చేతిలో కంగుతిన్నాడు. సతీష్ కుమార్ (ప్లస్ 91 కేజీ) 3-0తో మిరోద్జిదిన్ కరిమోవ్ (తజకిస్థాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. నానో సింగ్, శివతాపా, మన్‌ప్రీత్, మనోజ్ కుమార్‌ల ప్రిక్వార్టర్స్ బౌట్లు సోమవారం జరగనున్నాయి.
 

మరిన్ని వార్తలు