ముందుగా ఖాతా తెరిచేదెవరో?

14 Apr, 2018 01:37 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

సాధారణంగా ఐపీఎల్‌ని ముంబై అద్భుతంగా ఆరంభించదు. ఈ సారి కూడా అలాగే జరుగుతోంది. అయితే ఆఖరి బంతికి గెలుపు ఖాయమైన గత రెండు మ్యాచ్‌ల తరహా పరిస్థితి మళ్లీ రాకూడదని డిఫెండింగ్‌ చాంపియన్‌ కోరుకుంటోంది. రెండు సార్లూ విజయానికి చేరువగా వచ్చినా అదృష్టం కలిసి రాలేదు. తమ జట్టులోని డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌లు ఇంకా స్థాయికి తగినట్లుగా ఆడటం లేదు కాబట్టి ఈ సారి టాస్‌ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్‌ చేయాలని ముంబై కోరుకోవచ్చు. కొత్త కుర్రాడు మయాంక్‌ మార్కండే అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఒక లెగ్‌స్పిన్నర్‌ కచ్చితత్వంతో బౌలింగ్‌ చేయడం అంత సులువు కాదు. కానీ స్పిన్‌ బౌలింగ్‌లో అత్యుత్తమంగా కీపింగ్‌ చేయగల వికెట్‌ కీపర్లు కూడా అతని గుగ్లీని అర్థం చేసుకోలేకపోతున్నారు. ధోని, సాహాలాంటివాళ్లు అతని బౌలింగ్‌లో అవుటయ్యారంటే వేరేవాళ్లకు కూడా కష్టమేనని అర్థమవుతుంది. వీళ్లిద్దరు ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లకు కీపింగ్‌ చేశారు. బంతి ఏ దిశలో వెళుతుంది, ఎంతగా టర్న్‌ అవుతుందో వీరికి బాగా తెలుసు. కాబట్టి వీరిని అవుట్‌ చేయడం మార్కండే సాధించి ఘనతగా చెప్పగలను.

ఇప్పటి నుంచి  అతని రనప్‌ మొదలు బంతుల్లో వైవిధ్యం వరకు అన్ని అంశాలపై ప్రత్యర్థి జట్ల కంప్యూటర్‌ నిపుణులు దృష్టి పెడతారు కాబట్టి ఇక ముందు మార్కండేకు అంత సులువు కాకపోవచ్చు. ముంబై తరఫున ఇప్పటి వరకు మార్కండే బెస్ట్‌ బౌలర్‌గా నిలవగా... పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు బుమ్రా, ముస్తఫిజుర్‌ పెద్దగా రాణించకపోవడమే ముంబై ఇబ్బందులకు కారణం. రోహిత్‌ శర్మ విఫలం కావడం వల్ల కూడా ముంబై భారీ స్కోర్లు చేయలేకపోతోంది. ఆ జట్టు పొలార్డ్‌ను కూడా బ్యాటింగ్‌కు ఆర్డర్‌లో ముందుకు పంపించి ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఇవ్వాలి. మరోవైపు ఢిల్లీ జట్టు తమపై అనవసరపు ఒత్తిడిని పెంచుకోవడంతో మైదానంలో ఆ జట్టు చురుగ్గా కనిపించలేదు. గంభీర్, పాంటింగ్‌ స్థాయి వ్యక్తులు జత కలవడం వల్ల అంచనాలు పెరిగిపోయి ఇలాంటిది జరుగుతుంటుంది. భారత దేశవాళీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతి బలమైన జట్లయిన ముంబై, ఢిల్లీ మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరమే. ఐపీఎల్‌ కూడా అందుకు భిన్నం కాదు. ఇరు జట్లు ఖాతా తెరవాల్సిన స్థితిలో ఈ మ్యాచ్‌ మరింత కీలకం. 

మరిన్ని వార్తలు