వాయిదా వేసి మంచిపని చేసింది : గవాస్కర్‌

14 Mar, 2020 12:14 IST|Sakshi

ముంబై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ను వాయిదా వేసి బీసీసీఐ చాలా మంచి పని చేసందని లిటిల్‌ మాస్టర్‌, మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావాస్కర్‌ పేర్కొన్నాడు. ' బీసీసీఐ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రసుత్తం మ్యాచ్‌లకన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమైనది. ఒకవేళ ఐపీఎల్‌ నిర్వహిస్తే మ్యాచ్‌లు చూసేందుకు వేలాది ప్రేక్షకులు స్టేడియాలకు తరలివస్తారు. హోటల్స్‌, మాల్స్‌లో అనేకమంది విడిది ఉంటారు. కాబట్టి ఎవరైనా వైరస్‌ బారీన పడే అవకాశం ఉంటుంది. వాళ్ల వల్ల ఇతరులకు కూడా ఆ వ్యాది వ్యాపించే అవకాశం ఉంది. అందుకే బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నా' అంటూ తెలిపాడు. (కరోనా ఎఫెక్ట్‌ : ఆసీస్‌-కివీస్‌ సిరీస్‌ రద్దు)

ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను రద్దు చేయడంపై కూడా గవాస్కర్‌ స్పందించాడు.' ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాచ్‌లు చూడడానికి స్టేడియాలకు ఎవరు రారు. ఒకవేళ ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించినా పెద్ద ఉపయోగం ఉండదు. స్టేడియం ఖాళీగా ఉంటే ఏ ఆటగాడైనా సరే ఉత్సాహంగా ఆడాలని మాత్రం అనుకోడు. అలాంటి టోర్నీలు నిర్వహించడం కూడా వ్యర్థమే.' అంటూ వివరించాడు. టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపాడు.' ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్‌ను వాయిదా వేయడమే మంచిది. ప్రజల ఆరోగ్యం కన్నా మాకు ఏది గొప్పది కాదు.బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందేనని.. కావాలంటే ఐపీఎల్‌ మ్యాచ్‌లు నెలరోజుల తర్వాతైనా పెట్టుకోవచ్చు' అన్నాడు. (ఐపీఎల్‌ 2020 వాయిదా)

భారత్‌లో కరోనా ప్రభావం రోజురోజుకు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై విదేశాల నుంచి వచ్చే వారికి ఏప్రిల్‌ 15వరకు వీసా మంజూరు చేసేది లేదంటూ ఆంక్షలు విధించింది. దీంతో విదేశీ ఆటగాళ్లు లేకుండా ఐపీఎల్‌ నిర్వహించొద్దు అంటూ ఫ్రాంచైజీలు బీసీసీఐని ఆశ్రయించాయి.  మరోవైపు ఢిల్లీ, కర్ణాటక, హరియాణా, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు ఐపీఎల్‌ ఆడించడానికి సిద్దంగా లేమని తేల్చశాయి. ప్రసుత్త పరిస్థితుల దృష్యా ఐపీఎల్‌ను వాయిదా వేయడమే కరెక్టని భావించిన బీసీసీఐ శుక్రవారం ఏప్రిల్‌ 15వరకు ఐపీఎల్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో జరగుతున్న వన్డే సిరీస్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు