దిగ్గజ క్రికెటర్‌ను అవమానపరుస్తారా?

21 Mar, 2020 10:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను మరో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలా మార్చలేమన్న భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి చెందిన ఓ అధికారి చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ మండిపడ్డారు. మొదట షెడ్యూల్‌ ప్రకారం ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ను జరుపుదామని బీసీసీఐ ప్రయత్నించినా, విదేశీ ఆటగాళ్లుంటేనే బావుంటుందనే ఆలోచనతో లీగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి దేశవాళీ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ ప్రస్తావన తెచ్చారు. ‘ఐపీఎల్‌ను.. తక్కువ నాణ్యత కలిగిన టోర్నీగా ప్రదర్శించలేమని చెబుతూ, మరో ముస్తాక్‌ అలీ టోర్నీ అవసరం లేదన్న ఆ అధికారి వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. ఎందుకంటే వారు ఓ దిగ్గజాన్ని అవమానపరిచారు. ఆ తర్వాత దాన్ని పేలవ టోర్నీగా పేర్కొన్నారు. మరి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీని ఎందుకు నిర్వహిస్తున్నారు.(ధోని భవితవ్యంపై గావస్కర్‌ స్పందన..)

ముందు ఆ టోర్నీ పేరు చెప్పి ఓ గ్రేట్‌ మ్యాన్‌ను అగౌరవపరిచారు. ఆ తర్వాత పేలవమైన టోర్నమెంట్‌ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆ టోర్నీ ఎందుకు పేలవంగా మారింది. ఆ టోర్నీలో అంతర్జాతీయ ఆటగాళ్లు ఉండరు అనే విషయం తెలుసుకదా. అది దేశవాళీ టోర్నీ.   అంతర్జాతీయి స్థాయిలో ఆడే భారత ఆటగాళ్లు లేకపోవడం వల్లే అది పేలవంగా మారిపోయింది. బీసీసీఐ బిజీ షెడ్యూల్‌ కారణంగా ముస్తాక్‌ అలీ టోర్నీకి ఆదరణ తగ్గింది. దీనిపై బీసీసీఐ కచ్చితంగా దృష్టి సారించాలి. ఆ టోర్నీని మెరుగుపరిచే అంశంపై ఫోకస్‌ చేయాలి’ అని గావస్కర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు