పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ ప్రతీకారం

26 Apr, 2018 23:36 IST|Sakshi

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ సొంత మైదానంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. కింగ్స్‌ పంజాబ్‌ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయాన్ని అందుకుంది. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి సన్‌రైజర్స్‌ ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో సన్‌రైజర్స్‌ చెలరేగిపోయింది. కింగ్స్‌ పంజాబ్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం పైచేయి సాధించింది. ప్రధానంగా సన్‌రైజర్స్‌ రషీద్‌ ఖాన్‌, షకిబుల్‌ హసన్‌లు అద్భుతమైన స్పెల్‌తో కింగ్స్‌కు చుక‍్కలు చూపించారు.‍ రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు సాధిస్తే, షకీబుల్‌ రెండు వికెట్లతో మెరిశాడు. వీరికి జతగా సందీప్‌ శర్మ, బాసిల్‌ థంపిలు చెరో రెండు వికెట్లు తీశారు. కింగ్స్‌ ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌(32), గేల్‌(23) మిగతా బ్యాట్స్‌మెన్‌ కనీసం పోరాటం చేయకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

అంతకుముందు సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.  మనీష్‌ పాండే(54) హాఫ్‌ సెంచరీకి తోడు షకిబుల్‌ హసన్‌(28),యూసఫ్‌ పఠాన్‌(21నాటౌట్‌) ఫర్వాలేదనిపించడంతో సాధారణ స్కోరును నమోదు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో రాజ్‌పుత్‌ ఐదు వికెట్లు సాధించగా, ముజిల్‌ ఉర్‌ రహ్మాన్‌ వికెట్‌ తీశాడు.

మరిన్ని వార్తలు