సన్‌రైజర్స్‌దే విజయం

9 Apr, 2018 23:11 IST|Sakshi

హైదరాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 15.5 ఓవర్లలోనే ఛేదించింది.  శిఖర్‌ ధావన్‌(77 నాటౌట్‌; 13ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్‌ సెంచరీ సాధించగా, కేన్‌ విలియ‍మ్సన్‌(36 నాటౌట్‌; 3ఫోర్లు,1సిక్స్‌) సమయోచితంగా ఆడటంతో సన్‌రైజర్స్‌ సునాయాసంగా విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను అజింక్యా రహానే, డీఆర్సీ షార్ట్‌లు ఆరంభించగా వారికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డీ ఆర్సీ షార్ట్‌(4) నిరాశపరిచడంతో రాజస్తాన్‌ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కేన్‌ విలియమ్సన్‌ రనౌట్‌ చేయడంతో డీ ఆర్సీ షార్ట్‌ తన వికెట్‌ను సమర‍్పించుకున్నాడు.

అటు తర్వాత రహానే-సంజూ సామ్సన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకుంది. అయితే జట్టు స్కోరు 52 పరుగుల వద్ద రహానే(13) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెన్‌ స్టోక్స్‌(5) కూడా పెవిలియన్‌ బాట పట్టడంతో రాజస్తాన్‌ 63 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సామ్సన్‌(49; 42 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో రాజస్తాన్‌ తిరిగి తేరుకుంది. సామ్సన్‌ పరుగు దూరంలో హాఫ్‌ సెంచరీని కోల్పోయిన తర్వాత మిగతా ఆటగాళ్లు పెద్దగా ఆకట్టుకోలేదు. రాహుల్‌ త్రిపాఠి(17), శ్రేయస్‌ గోపాల్‌(18)లు మాత్రమే సామ్సన్‌ తర్వాత అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లు. దాంతో 126 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే రాజస్తాన్‌ నిర్దేశించింది. సన్‌ రైజర్స్‌ బౌలర్లలో సిద్ధార్ధ్‌ కౌల్‌, షకిబుల్‌ హసన్‌ చెరో రెండు వికెట్ల తీసి ఆకట్టుకోగా,  భువనేశ్వర్‌ కుమార్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు