అందుబాటులో సన్‌రైజర్స్‌ టికెట్లు

17 Mar, 2019 10:04 IST|Sakshi

నేటి నుంచి నగరంలోని పలు వేదికల్లో లభ్యం  

సన్‌రైజర్స్‌ స్పాన్సర్‌గా కూల్‌వింక్స్‌...

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియన్‌  ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వీరాభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) మ్యాచ్‌ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ ఆడే మ్యాచ్‌ల టికెట్లు నేటి నుంచి అభిమానులు పొందవచ్చు. నగరంలోని 12 వేదికల్లో ఈ టికెట్లు లభ్యం కానున్నాయి. జింఖానా, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్‌ స్టేడియం, బి–డబ్స్, అసెంబ్లీ మెట్రో స్టేషన్‌, సరూర్‌నగర్‌ మెట్రో స్టేషన్‌  ఔట్‌లెట్‌లలో రిటైల్‌ అమ్మకాలతో పాటు టికెట్‌ రిడెమ్షన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ , మూసాపేట్‌ మెట్రో స్టేషన్‌, హైదరాబాద్‌ నెక్ట్స్‌ గెలారియా మాల్‌ (పంజగుట్ట), హైదరాబాద్‌ నెక్ట్స్‌ గెలారియా మాల్‌ (హైటెక్‌ సిటీ), బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌ , నాగోల్‌ మెట్రో స్టేషన్‌ఔట్‌లెట్‌లలో కేవలం రిటైల్‌ టికెట్లు మాత్రమే పొందవచ్చు.

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈనెల 29న (శుక్రవారం) రాత్రి 8 గంటల నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌తో, 31న సాయంత్రం 4 గంటల నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సన్‌రైజర్స్‌– రాజస్థాన్‌ రాయల్స్‌ చాలెంజర్స్‌ మధ్య జరుగనున్న తొలి మ్యాచ్‌ కనీస టికెట్‌ ధర రూ. 500గా నిర్ణయించారు. ఈ ధర కేవలం తొలి మ్యాచ్‌కు మాత్రమే వర్తిస్తుంది. 31న జరిగే మ్యాచ్‌ కనీస టికెట్‌ ధర రూ. 781గా ఉండనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. హోంగ్రౌండ్‌లో జరగాల్సిన మిగతా ఐదు మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు. అభిమానులు టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా లేదా రిటైల్‌గానూ పొందవచ్చు. మరిన్ని వివరాలకు  www.sunrisershyderabad.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.


ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రాక్టీస్‌...  

మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో సత్తా చాటేందుకు హైదరాబాద్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌             (ఎస్‌ఆర్‌హెచ్‌) ముమ్మర సాధన మొదలుపెట్టింది. గత సీజన్‌ లో టేబుల్‌ టాపర్‌గా నిలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ మళ్లీ అదేస్థాయి ఆటను ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో శనివారం సరైజర్స్‌ సభ్యులు ఉప్పల్‌ మైదానంలో కసరత్తులు చేశారు.

కీలక ఆటగాళ్లు ఇంకా జట్టుతో కలవనప్పటికీ... కోచ్‌ టామ్‌ మూడీ, మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో యువ ఆటగాళ్లు ఖలీల్‌ అహ్మద్, సిద్ధార్థ్‌ కౌల్, అభిషేక్‌ శర్మ... సీనియర్లు యూసుఫ్‌ పఠాన్‌ , బాసిల్‌ థంపి, విజయ్‌ శంకర్‌ తదితరులు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.      
–సాక్షి, హైదరాబాద్‌

>
మరిన్ని వార్తలు