సురేశ్ రైనా అభిమానులకు గుడ్ న్యూస్

21 Dec, 2017 17:32 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: టీమిండియాలోకి రావడానికి మరో సీనియర్ క్రికెటర్ కు మార్గం సుగమమైంది. గత కొంత కాలం నుంచి ఫిట్ నెస్ కోసం నిర్వహించే యో యో టెస్టులో విఫలమవుతున్న భారత క్రికెటర్ సురేశ్ రైనా తాజాగా ఈ టెస్టులో పాసయ్యాడట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వివరించాడు. భారత జట్టులో చోటు కోల్పోయిన మరో సీనియర్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ ఇటీవల ఈ యో యో టెస్టులో పాసైన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లకు మరోసారి భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునేందుకు తలుపులు తెరుచుకున్నాయి.

జట్టులో చోటు కోల్పోయిన క్రికెటర్లు మళ్లీ ఎంపిక కావాలంటే బీసీసీఐ నిర్వహించే యో యో ఫిట్ నెస్ టెస్ట్ పరీక్షలో పాస్ కావాలన్న నిబంధన తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో గురువారం నిర్వహించిన యో యో టెస్టులో రైనా పాసయ్యాడు. ఈ సంతోషాన్ని తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు రైనా. 'ఎంతో శ్రమించి యో యో టెస్టులో పాసయ్యాను. కోచ్, ట్రైనర్లు, నిర్వాహకుల నుంచి ఎంతో మద్దతు లభించింది. ఎన్సీఏలో గడిపిన రోజులు నాలో స్ఫూర్తిని రగిలించాయని' రాసుకొచ్చాడు రైనా. అకాడమీ కోచ్, ట్రైనర్లతో కలిసి దిగిన ఫొటోలను ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. ఫిట్ నెస్ పరీక్షలో పాసైన రైనా ఇక ఆటపై దృష్టిపెడితే మరికొన్ని రోజుల్లో భారత క్రికెట్ జట్టులో అతడిని చూడవచ్చునంటూ క్రికెటర్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు