బ్యాట్స్‌మెన్‌ మళ్లీ విఫలం

23 Feb, 2019 10:12 IST|Sakshi

 హైదరాబాద్‌కు రెండో ఓటమి

 6 వికెట్లతో ఉత్తర్‌ప్రదేశ్‌ విజయం

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. ఫలితంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కిది వరుసగా రెండో ఓటమి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. బావనక సందీప్‌ (31 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ అంబటి రాయుడు (31 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో అంకిత్‌ రాజ్‌పుత్‌ 3, అ„Š దీప్‌ నాథ్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌లో సురేశ్‌ రైనా (35 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ చేయడంతో ఉత్తర్‌ప్రదేశ్‌ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసి గెలుపొందింది. సమర్థ్‌ సింగ్‌ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ఆశిష్‌ రెడ్డి 3 వికెట్లు పడగొట్టగా, సాకేత్‌కు ఒక వికెట్‌ దక్కింది.  


ఈసారి టాపార్డర్‌...

పాండిచ్చేరితో జరిగిన తొలి మ్యాచ్‌లో లోయరార్డర్‌ రాణించకపోవడంతో విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయిన హైదరాబాద్‌... ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌ బ్యాట్‌ ఝళిపించకపోవడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌ (16; 2 ఫోర్లు, 1 సిక్స్‌), అక్షత్‌ రెడ్డి (9) త్వరగానే ఔటయ్యారు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఆశిష్‌ రెడ్డి (16; 2 ఫోర్లు), బి. సందీప్‌ కాసేపు క్రీజులో నిలిచారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 42 పరుగుల్ని జోడించారు. క్రీజులో కుదురుకుంటోన్న ఈ జంటను అ„Š దీప్‌నాథ్‌ విడగొట్టాడు. కొద్ది పరుగుల వ్యవధిలోనే ఇద్దరినీ పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల వేగం నెమ్మదించింది. అంబటి రాయుడు ఆచితూచి ఆడగా... మరో ఎండ్‌లో కె. రోహిత్‌ రాయుడు (7), సీవీ మిలింద్‌ (1) క్రీజులో నిలవలేకపోయారు. ఈ దశలో రాయుడుకు సుమంత్‌ (18 నాటౌట్‌) అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 26 పరుగులు జోడించాక అంకిత్‌ బౌలింగ్‌లో జట్టు స్కోరు 136 పరుగుల వద్ద రాయుడు ఎల్బీగా వెనుదిరిగాడు.  

రైనా మెరుపులు...
సాధారణ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఉపేంద్ర యాదవ్‌ (25), సమర్థ్‌ సింగ్‌ (36) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్‌ రైనా ధాటికి లక్ష్యం కరిగిపోయింది. కెప్టెన్‌ అక్ష్‌ దీప్‌ నాథ్‌ (3), రింకూ సింగ్‌ (0) విఫలమైనప్పటికీ...  ప్రియం గార్గ్‌ (19 నాటౌట్‌) తోడుగా రైనా సులువుగా లక్ష్యాన్ని ఛేదించాడు.  

స్కోరు వివరాలు

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ (బి) అంకిత్‌ 16; అక్షత్‌ రెడ్డి (బి) యశ్‌ దయాల్‌ 9, ఆశిష్‌ రెడ్డి (బి) అక్ష్‌ దీప్‌నాథ్‌ 16; సందీప్‌ (సి) బాబీ (బి) అ„Š దీప్‌నాథ్‌ 33; రాయుడు ఎల్బీ (బి) అంకిత్‌ 29; రోహిత్‌ రాయుడు (సి) ఉపేంద్ర (బి) సౌరభ్‌ కుమార్‌ 7; మిలింద్‌ (సి) రైనా (బి) అంకిత్‌ 1; సుమంత్‌ (నాటౌట్‌) 18; మెహదీ హసన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139.

వికెట్ల పతనం: 1–24, 2–26, 3–68, 4–92, 5–106, 6–113, 7–136.

బౌలింగ్‌: అంకిత్‌ రాజ్‌పుత్‌ 4–1–31–3, యశ్‌ దయాల్‌ 3–8–21–1, శివ సింగ్‌ 4–7–24–0, బాబీ 2–6–10–0, సౌరభ్‌ 3–3–32–1, అ„Š దీప్‌ 4–7–18–2.
ఉత్తర్‌ప్రదేశ్‌ ఇన్నింగ్స్‌: ఉపేంద్ర యాదవ్‌ ఎల్బీ (బి) ఆశిష్‌ రెడ్డి 25; సమర్థ్‌ సింగ్‌ (సి) రాయుడు (బి) సాకేత్‌ 36; రైనా (నాటౌట్‌) 54; అ„Š దీప్‌ ఎల్బీ (బి) ఆశిష్‌ రెడ్డి 3; రింకూ సింగ్‌ (సి) సుమంత్‌ (బి) ఆశిష్‌ 0;  ప్రియం గార్గ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 143.
వికెట్ల పతనం: 1–48, 2–85, 3–97, 4–97.
బౌలింగ్‌: సిరాజ్‌ 3–8–28–0, మిలింద్‌ 3.3–9–24–0, మెహదీహసన్‌ 4–9–32–0, సాకేత్‌ 4–9–23–1, ఆశిష్‌ రెడ్డి 4–8–33–3.

మరిన్ని వార్తలు