ఈ ఓటమి మాకు మేలుకొలుపు : రైనా

18 Apr, 2019 08:37 IST|Sakshi
సురేశ్‌ రైనా

హైదరాబాద్‌ : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఊహించని ఓటమి తమకు ఓ మేలుకొలుపని చెన్నైసూపర్‌ కింగ్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ సురేశ్‌ రైనా అభిప్రాయపడ్డాడు. మంచి ఆరంభం లభించినా.. దాన్ని కొనసాగించలేక తడబడ్డామని, స్పల్ప లక్ష్యం నిర్దేశించడంతో ఓటమి తప్పలేదన్నాడు. బుధవారం ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసింది. ఇక ఈ మ్యాచ్‌కు వెన్నునొప్పితో ఇబ్బంది పడిన ధోనికి ముందస్తు జాగ్రత్తగా విశ్రాంతి ఇచ్చారు. దీంతో సురేశ్‌ రైనా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. వరుస విజయాలతో ఊపు మీదున్న చెన్నైని.. వరుస పరాజయాలతో సతమతమైన సన్‌రైజర్స్‌ ఓడించింది.

మ్యాచ్‌ అనంతరం సురేశ్‌ రైనా ఓటమిపై స్పందిస్తూ.. ‘ నాకు తెలిసి ఇది మాకు మంచి మేలుకొలుపు వంటిది. మేం మంచి లక్ష్యాన్ని నిర్ధేశించలేదు. త్వరత్వరగా వికెట్లు కోల్పోయాం. ఫాఫ్‌, వాట్సన్‌ అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. కానీ మేం దాన్ని అందిపుచ్చుకోలేకపోయాం. మేం త్వరగా వికెట్ల కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మేం భాగస్వామ్యాలపై దృష్టిసారించాల్సింది. స్ట్రైక్‌రేట్‌ గొప్పగా రొటేట్‌ చేయాల్సింది. మేం 30 పరుగులు తక్కువగా చేశాం. ఇక ధోని కెప్టెన్‌గా ఉంటేనే బాగుంటుంది. అతను గాయం నుంచి కోలుకున్నాడు. మరసటి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు.’ అని రైనా చెప్పుకొచ్చాడు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించారు. రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు