‘టోక్యో’కు సుశీల్‌ క్వాలిఫై కావాలంటే..

20 Sep, 2019 14:28 IST|Sakshi

నూర్‌ సుల్తాన్‌(కజికిస్తాన్‌): వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల 74 కేజీల కేటగిరీలో సుశీల్‌ 9-11 తేడాతో కడ్జిమురాద్‌ గాడ్జియెవ్‌(అజెర్‌బైజాన్‌)చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ పోరు రౌండ్‌-1లో సుశీల్‌ కుమార్‌ ఆధిక్యంలో నిలిచినా చివరకు ఓటమి తప్పలేదు. బ్రేక్‌ సమయానికి ఐదు పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సుశీల్‌.. ఆపై వెనకబడ్డాడు. తిరిగి పుంజుకున్న గాడ్జియెవ్‌.. సుశీల్‌ను  తేరుకోనివ్వలేదు. దాంతో రెండు పాయింట్ల తేడాతో సుశీల్‌ పరాజయం చెందాడు.

దాంతో సుశీల్‌ కుమార్‌ టోక్యో ఒలింపిక్స్‌ బెర్తు క్లిష్ట తరంగా మారింది. గాడ్జియెవ్‌ ఫైనల్‌కు చేరితేనే సుశీల్‌కు రెపిచేజ్‌ ద్వారా ఒలింపిక్స్‌ బెర్తు ఆశలు సజీవంగా ఉంటాయి. కాంస్య పతకం కోసం జరిగే రెపిచేజ్‌లో సత్తాచాటితేనే సుశీల్‌ కాంస్యంతో పాటు ఒలింపిక్స్‌ బెర్తును ఖాయం చేసుకుంటాడు. ఇదిలా ఉంచితే, ప్రవీణ్‌ రాణా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ రోజు జరిగిన 92 కేజీల ఫ్రీస్టైయిల్‌ రెజ్లింగ్‌ కేటగిరీలో ప్రవీణ్‌ 12-1 తేడాతో చాంగ్జె సు(దక్షిణ కొరియా)పై గెలిచాడు.

మరిన్ని వార్తలు