రెజ్లర్ సుశీల్ కుమార్ కొత్త ఇన్నింగ్స్!

30 Dec, 2016 13:17 IST|Sakshi
రెజ్లర్ సుశీల్ కుమార్ కొత్త ఇన్నింగ్స్!

ముంబై: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో  ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్.. కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్ కొత్త ఇన్నింగ్స్ లో భాగంగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్యూడబ్యూడబ్యూ)తో ఒప్పందం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నాడు ఈ హర్యానా రెజ్లర్.  ఈ మేరకు గత అక్టోబర్లో డబ్యూడబ్యూడబ్యూతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన సుశీల్ కుమార్.. అందుకు తాజాగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో డబ్యూడబ్యూడబ్యూ ఈవెంట్లలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తికనబరచని సుశీల్.. తనకు అదే సరైనదని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే డబ్యూడబ్యూతో  మరొకసారి సంప్రదింపులు జరిపి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

వచ్చే ఏడాది నవంబర్ లో డబ్యడబ్యూడబ్యూ ఈవెంట్లలో సుశీల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ది గ్రేట్ ఖలీ తరువాత వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లలో పాల్గొన్న రెండో భారత రెజ్లర్గా సుశీల్ నిలుస్తాడు.

గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్.. రియోకు వెళ్లేందుకు తనకే అర్హత ఉందంటూ భారత రెజ్లింగ్ సమాఖ్యతో పోరాడి ఓడిపోయాడు. సాంకేతికంగా నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో సుశీల్ దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనిపై సుశీల్ కడవరకూ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 40 వరకూ ఉన్న రెజ్లర్లను షార్ట్ లిస్ట్ చేసే పనిలో పడ్డ డబ్యూడబ్యూడబ్యూ.. భారత రెజ్లర్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. దీనిలో్ భాగంగా సుశీల్ కుమార్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు