దుమ్మురేపిన సెహ్వాగ్, గంభీర్

5 Apr, 2014 00:49 IST|Sakshi
దుమ్మురేపిన సెహ్వాగ్, గంభీర్

ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం
 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ
 
 చండీగఢ్: జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మ దేశవాళీ టోర్నీలో సత్తా చాటుకుంటున్నారు. ఈ త్రయం ప్రతిభతో సయ్యద్ ముస్తాక్ అలీ (నార్త్‌జోన్) టి20 టోర్నీలో ఢిల్లీ జట్టు వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది.
 
  గౌతమ్ గంభీర్ (53 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), వీరేంద్ర సెహ్వాగ్ (50 బంతుల్లో 49; 3 ఫోర్లు, 1 సిక్సర్)... బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ (4/9) చెలరేగారు. ఫలితంగా హర్యానాతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత హర్యానా 20 ఓవర్లలో 7 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఇషాంత్ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం ఢిల్లీ 17.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి 142 పరుగులు చేసింది. గంభీర్, వీరూ తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు.
 

మరిన్ని వార్తలు