పంజాబ్‌కు ‘సూపర్‌’ విజయం

22 Jan, 2018 04:12 IST|Sakshi

మెరిసిన హర్భజన్, యువరాజ్‌

ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ

కోల్‌కతా: భారత వెటరన్‌ స్టార్స్‌ యువరాజ్‌  సింగ్, హర్భజన్‌ సింగ్‌ మెరుపులతో ఉత్కం‘టై’న మ్యాచ్‌లో పంజాబ్‌ సూపర్‌ ఓవర్‌తో గెలిచింది. ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీ సూపర్‌లీగ్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 4 పరుగుల తేడాతో కర్ణాటకపై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. అనిరుధ జోషి (19 బంతుల్లో 40 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 ఫోర్‌) ధాటిగా ఆడాడు. తర్వాత 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కూడా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 158 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై అయింది.

పంజాబ్‌ ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ (45; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించగా, వన్‌డౌన్‌లో దిగిన కెప్టెన్‌ భజ్జీ (19 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్‌), యువీ (25 బంతుల్లో 29; 5 ఫోర్లు) తమ అనుభవాన్ని చాటారు. ఫలితం కోసం సూపర్‌ ఓవర్‌ ఆడించగా మొదట పంజాబ్‌ 15 పరుగులు చేసింది. తర్వాత కర్ణాటక 11 పరుగులే చేసి ఓడింది. గ్రూప్‌ ‘ఎ’లో మరో మ్యాచ్‌లో ముంబై 13 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై గెలిచింది. గ్రూప్‌ ‘బి’లో రిషభ్‌ పంత్‌ (58; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటికి ఢిల్లీ 8 వికెట్ల తేడాతో తమిళనాడుపై... బరోడా 17 పరుగులతో బెంగాల్‌పై విజయం సాధించాయి.  

మరిన్ని వార్తలు