హ్యాట్రిక్‌ ఓటములు.. టీమిండియా ఔట్‌

26 Mar, 2018 14:51 IST|Sakshi

సాక్షి, ముంబై : హ్యాట్రిక్‌ ఓటములతో టీమిండియా మహిళల జట్టు ముక్కోణపు టీ20 సిరీస్‌ నుంచి నిష్క్రమించింది. పేటీఎం కప్‌లో భాగంగా సోమవారం ముంబైలోని బ్రాబౌర్నే స్టేడియంలో ఆస్ట్రేలియా-భారత్‌ తలబడ్డాయి. 187 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

తొలుత టాస్‌ గెలిచిన టీమిండియా జట్టు ఆస్టేలియాను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. ఎలిసే విలని 61 పరుగుల స్కోర్‌ సాధించటంతో 20 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 5 వికెట్లు నష్టపోయి 186 పరుగులు సాధించింది. ఇక 187 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఆది నుంచే తడబడింది. ఆసీస్‌ బౌలర్‌ మెగాన్‌ స్కట్‌ బౌలింగ్‌ ధాటికి రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ స్మృతి మంధాన(3), మిథాలీ రాజ్‌ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ వికెట్‌ను కూడా దక్కించుకోవటంతో హ్యాట్రిక్‌ సాధించి.. టీ20లో తొలి హ్యాట్రిక్‌ సాధించిన ఆస్ట్రేలియన్‌ బౌలర్‌గా(ఓవరాల్‌గా ఏడో బౌలర్‌) మెగాన్‌ స్కట్‌ నిలిచారు. 

చివరకు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసిన టీమిండియా జట్టు 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అనుజా పాటిల్‌ 38 పరుగులు, పూజా 19 పరుగులు సాధించారు. ఇక వరుసగా మూడు ఓటములతో ఈ ట్రై సిరీస్‌ ఫైనల్‌ బెర్త్‌కు దూరమైంది. అయితే ఇంగ్లాండ్‌తో మరో నామ మాత్రపు మ్యాచ్‌ను భారత్‌ ఆడనుండగా.. కప్‌ కోసం ఫైనల్‌లో ఇంగ్లాండ్‌-ఆసీస్‌లు తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు