టాటా ఓపెన్‌ టోర్నీ ఫైనల్లో వృశాలి

2 Dec, 2018 01:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక టాటా ఓపెన్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ అమ్మాయి గుమ్మడి వృశాలి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో ఎనిమిదో సీడ్‌ వృశాలి 21–11, 21–12తో ముగ్ధా ఆగ్రే (భారత్‌)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో అష్మిత (భారత్‌) 21–19, 21–19తో నాలుగో సీడ్‌ చానన్‌చిడా జుచారోన్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గి వృశాలితో ఆదివారం జరిగే టైటిల్‌ పోరుకు సిద్ధమైంది.

పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్యసేన్‌ (భారత్‌) 17–21, 21–9, 21–12తో కంటావత్‌ లీలావెచబుర్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొంది ఫైనల్‌ చేరాడు. మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో తెలంగాణ క్రీడాకారిణి జక్కంపూడి మేఘన–పూర్వీషా రామ్‌ జంట 21–18, 9–21, 25–23తో రుతుపర్ణ పాండా–ఆరతి సునీల్‌ (భారత్‌) జోడీపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సుమీత్‌ రెడ్డి–అర్జున్‌ రామచంద్రన్‌ ద్వయం 21–16, 20–22, 21–14తో టిన్‌ ఇస్రియానెత్‌– తనుపట్‌ విరియాంగ్‌కురా (థాయ్‌లాండ్‌) జంటపై నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది.    

మరిన్ని వార్తలు