సెంచూరియన్: టీమిండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో సఫారీలు విజయం సాధించి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లిన నేపథ్యంలో విరాట్ గ్యాంగ్కు రెండో టెస్టు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తేనే సిరీస్లో నిలుస్తుంది. కాని పక్షంలో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సఫారీలకు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంచితే, టెస్టు ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా ఆర్మీ, నావికా సిబ్బంది ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. గతంలో ఏ క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు లేని విధంగా మైదానం సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 21సార్లు గాల్లోకి కాల్పులు జరిపి మ్యాచ్ను ప్రారంభించనున్నారు.
గతంలో దక్షిణాఫ్రికాలో ఎంతో ప్రేక్షకాదరణ ఉన్న రగ్బీ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇలా చేసేవారు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై ఏ క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇలాంటి ప్రదర్శన చేయలేదు. సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో రేపు మ్యాచ్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికా బలగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో క్రికెట్కు భారీగా ఆదరణ పెరిగి, యువత ఎక్కువగా క్రికెట్ను కెరీర్గా మల్చుకుంటోంది. వారందరినీ ప్రోత్సహించేందుకే క్రికెట్కు అరుదైన గౌరవం ఇవ్వాలనే యోచనలో భాగంగానే ఈ క్యార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దక్షిణాఫ్రికా ఆర్మీ, నావికా సిబ్బంది ప్రత్యేక ప్రదర్శన