కేరళలో ధావన్‌​ హంగామా; ఆశ్చర్యంలో అభిమానులు

4 Sep, 2019 12:44 IST|Sakshi

సముద్ర తీరాన గబ్బర్‌ వేణుగానం

తిరువనంతపురం : టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌లో కొత్తకోణం వెలుగు చూసింది. అభిమానులను ఆశ్చర్యంతో ముంచెత్తుతూ గబ్బర్‌ వేణుగానంతో పరవశింపజేశాడు. అతని వేణుగానం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దైవ భూమి కేరళలో.. సముద్ర తీరాన ధావన్‌ తన్మయత్వంతో వేణు గానం చేశాడు. గురువు వేణుగోపాల స్వామి వద్ద గత మూడేళ్లుగా ఫ్లూట్‌ వాయించడం నేర్చుకుంటున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ‘సరికొత్త ఆరంభం. చెట్లు, స్వచ్ఛమైన గాలి, చెంతనే సముద్రం. కాస్త సంగీతం. మరికాస్త ఆనందం’ అని పేర్కొన్నాడు. ఇక గబ్బర్‌ వేణుగానంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘నిజంగా మీరేనా’ అని ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
(చదవండి : ఇండియా ‘ఎ’ జట్టులో శిఖర్‌ ధావన్‌ )

ఇదిలాఉండగా.. వెస్టిండీస్‌ పర్యటనలో టీ20, వన్డే సిరిస్‌లలో పేలవ ప్రదర్శన కారణంగా ధావన్‌ టెస్టు సిరీస్‌కు ఎంపికవని సంగతి తెలిసిందే. అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగే చివరి రెండు అనధికారిక వన్డేలలో తలపడే భారత ‘ఎ’ జట్టులోకి అతన్ని సెలక్టర్లు ఎంపిక చేశారు. గాయంతో ప్రపంచకప్‌నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన అనంతరం ధావన్‌ విండీస్‌ గడ్డపై ఐదు మ్యాచ్‌లు ఆడాడు. 2 వన్డేలలో కలిపి 38 పరుగులు, 3 టి20 మ్యాచ్‌లలో కలిపి అతను 27 పరుగులే చేశాడు. 

మరిన్ని వార్తలు