సల్మాన్‌ చిత్రాన్ని వీక్షించిన టీమిండియా క్రికెటర్లు

12 Jun, 2019 17:59 IST|Sakshi

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లి సేన గురువారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘భారత్‌’ చిత్రాన్ని స్థానిక థియేటర్‌లో వీక్షించారు. ఈ విషయాన్ని సల్మాన్‌ వీరాభిమాని అయిన కేదార్‌ జాదవ్‌ తన ఇన్‌స్ట్రాగామ్‌లో వెల్లడించాడు. అంతేకాకుండా చిత్రానికి వెళ్లిన సభ్యులతో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్‌ చేశాడు. ‘భారత్‌’  చిత్రం వీక్షించిన వారిలో ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌తో పాటు టీమిండియా సహాయక సిబ్బంది ఉన్నారు.

ప్రస్తుతం జాదవ్‌ షేర్‌ చేసిన ఫోటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది.‍ కివీస్‌తో రెండు రోజుల్లో మ్యాచ్‌ పెట్టుకుని సినిమాకు పోవడంపై కొందరు టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్‌ సెషన్‌ పూర్తి అయిన తర్వాతే కొందరు ఆటగాళ్లు సినిమాకు, మరికొందరు షాపింగ్‌కు వెళ్లారని మేనేజ్‌మెంట్‌ తెలిపింది. ఇక ‘భారత్‌’ను వీక్షించిన టీమిండియా సభ్యులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. 

ఈద్ కానుకగా సల్మాన్ నటించిన 'భారత్' సినిమాని చిత్ర బృందం విడుదల చేసింది. సల్మాన్ ఐదు డిఫరెంట్ గెటప్స్ లో నటించిన ఈ చిత్రంలో టబు, జాకీ ష్రఫ్ ప్రధాన పాత్రలో నటించగా కత్రినా కైఫ్, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. కొరియన్ మూవీ 'ఓడే టూ మై ఫాదర్' రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం జూన్ 5న విడుదలయింది. మొదటి ఆట నుండే సూపర్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 

మరిన్ని వార్తలు