ఇద్దరిలో  ఎవరో?

15 Feb, 2019 00:38 IST|Sakshi

లెఫ్టార్మ్‌ పేసర్‌ స్థానం కోసం  ఖలీల్, ఉనాద్కట్‌ మధ్య పోటీ

ఆస్ట్రేలియాతో వన్డే, టి20 సిరీస్‌లకునేడు టీమిండియా ఎంపిక

కోహ్లి పునరాగమనం, రోహిత్‌కు  టి20ల నుంచి విశ్రాంతి

ముంబై: ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌నకు ముందు తేల్చాల్సిన ఒకటీ, రెండు స్థానాల లెక్కను సరిచేసేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న రెండు టి20లు, ఐదు వన్డేల సిరీస్‌ను ఇందుకు అవకాశంగా తీసుకుంటోంది. ఈ క్రమంలో జట్టు ఎంపిక కోసం శుక్రవారం ముంబైలో జాతీయ సెలక్టర్లు సమావేశం కానున్నారు. న్యూజిలాండ్‌తో మూడో వన్డే తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి అందుబాటుతో రంగంలోకి దిగనుండగా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ వైస్‌ కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు టి20ల నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. 

ఉనాద్కట్‌... అనూహ్యంగా! 
సౌరాష్ట్ర ఎడమ చేతివాటం పేసర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ పేరు ఎవరూ ఊహించని విధంగా సెలక్షన్‌ రేసులోకొచ్చింది. ప్రస్తుత రంజీ సీజన్‌లో సౌరాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో వేగం పెరగడంతో పాటు వైవిధ్యం కనిపిస్తుండటంతో ప్రపంచ కప్‌ బెర్తుకు పోటీదారయ్యాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనల్లో ఆడిన రాజస్థాన్‌ లెఫ్టార్మ్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఇంకా మెరుగవ్వాల్సి ఉండటం ఉనాద్కట్‌ అవకాశాలను పెంచింది. ప్రపంచ కప్‌నకు బుమ్రా, భువనేశ్వర్, షమీ తర్వాత నాలుగో పేసర్‌గా ఎడమ చేతివాటం బౌలర్‌ ఒకరు అవసరం ఉండటం, ఖలీల్‌తో పోలిస్తే అనుభవజ్ఞుడవటం ఉనాద్కట్‌కు మేలు చేకూర్చింది. ఉనాద్కట్‌ భారత్‌ తరఫున 2013 నవంబర్‌లో ఆఖరి సారిగా వన్డే ఆడాడు. ఏడాది క్రితం టి20 మ్యాచ్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 

రాహుల్‌కు పిలుపు! 
సాధారణంగా 15 మంది సభ్యులను ప్రకటించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి 16 లేదా 17 మందితో జట్టును ప్రకటించే వీలుంది. టీవీ షో వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో జట్టుకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి రానున్నాడు. టి20ల్లో అతడు ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌పై మంచి ఇన్నింగ్స్‌లు ఆడటం రాహుల్‌కు అవకాశం ఇచ్చి చూసేలా చేసింది. ఇక ధోనికి బ్యాకప్‌ కీపర్‌గా యువ రిషభ్‌ పంత్, సీనియర్‌ దినేశ్‌ కార్తీక్‌లలో ఎవరివైపు మొగ్గు చూపుతారనేది కూడా ఈ సిరీస్‌లో తేలనుంది. 

మరిన్ని వార్తలు