ఆసీస్‌కు భారీ టార్గెట్‌

17 Jan, 2020 17:19 IST|Sakshi

రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 341 పరుగుల భారీ టార్గెట్‌ను  నిర్దేశించింది. శిఖర్‌ ధావన్‌(96; 90  బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(78;76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ(42; 44 బంతుల్లో 6ఫోర్లు)లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళుతున్న క్రమంలో రోహిత్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఈ జోడి మొదటి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఆపై ధావన్‌కు కోహ్లి జతకలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే ధావన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు.  ఈ జోడి 103 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి శ్రేయస్‌ అయ్యర్‌(7) పెవిలియన్‌ చేరాడు. జంపా బౌలింగ్‌లో షాట్‌ ఆడబోగా అది మిస్‌ కావడంతో బౌల్డ్‌ అయ్యాడు.(ఇక్కడ చదవండి: ధావన్‌-కోహ్లి ఎట్‌ 3 వేలు)

గత మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి..ఈ మ్యాచ్‌లో మంచి జోష్‌ మీద ఉన్న సమయంలో పెవిలియన్‌ చేరాడు. ఆడమ్‌ జంపా వేసిన 44 ఓవర్‌ తొలి బంతిని భారీ షాట్‌ ఆడిన కోహ్లి పెవిలియన్‌ చేరాడు. కాగా, కోహ్లిని దురదృష్టం వెంటాడింది.  బౌలర్‌ ఎండ్‌ వైపు నేరుగా కోహ్లి భారీ షాట్‌  కొట్టగా, అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఆగర్‌ ఆ బంతిని బౌండరీ లైన్‌కు కాస్త వెలుపల పట్టుకుని దాన్ని మరో ఫీల్డర్‌ స్టార్క్‌కు విసిరేశాడు. ఇది ఆగర్‌ బౌండరీ లైన్‌ను దాటకముందే  స్టార్క్‌ కు అందివ్వడంతో కోహ్లి పెవిలియన్‌కు చేరాల్సి  వచ్చింది. (ఇక్కడ చదవండి: అయ్యో.. రోహిత్‌)

ఆపై వచ్చిన మనీష్‌ పాండే(2) స్వల్ప వ్యవధిలోనే ఔటయ్యాడు. ఆ తరుణంలో కేఎల్‌ రాహుల్‌కు జత కలిసిన రవీంద్ర జడేజా(20; 16 బంతుల్లో 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి 58 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్‌ రనౌట్‌ అయ్యాడు. అది చివరి ఓవర్‌ కావడంతో స్కోరును పెంచే క‍్రమంలో రాహుల్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్‌ జంపా మూడు వికెట్లు సాధించగా, కేన్‌ రిచర్డ్‌సన్‌ రెండు వికెట్లు తీశాడు. 


 

>
మరిన్ని వార్తలు