ఈ నెల 8న భారత జట్ల ఎంపిక

4 May, 2018 04:06 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు కోసం

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా

న్యూఢిల్లీ: వచ్చే నెల అఫ్గానిస్తాన్‌తో జరుగనున్న ఏకైక టెస్టు కోసం ఈ నెల 8న భారత జట్టును ప్రకటించనున్నారు. జూన్‌ 14 నుంచి బెంగళూ రు వేదికగా ప్రారంభం కానున్న చారిత్రాత్మక టెస్టుతో పాటు ఐర్లాండ్‌తో రెండు వన్డేల సిరీస్‌కు అదే రోజు జట్టును ప్రకటించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కోహ్లి కౌంటీ క్రికెట్‌ ఆడటం ఖాయం కావడంతో అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు అతను దూరం కానున్నాడు. ‘మే 8న జరుగనున్న సెలెక్షన్స్‌లో మూడు జట్ల ఎంపిక జరుగుతుంది.

అఫ్గాన్‌ టెస్టు కోసం బరిలో దిగే టెస్టు జట్టు, ఇంగ్లండ్‌ టూర్‌కు ముందు ఐర్లాండ్‌లో జరుగనున్న రెండు వన్డేల సిరీస్‌ కోసం వన్డే జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత ‘ఎ’ జట్టును కూడా ప్రకటిస్తాం’ అని బీసీసీఐ పేర్కొంది. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్‌ టూర్‌ కు ముందు మన ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. రహానే, మురళీ విజయ్, రోహిత్, హార్దిక్‌ పాండ్యాలను ‘ఎ’ జట్టుతో పాటు అక్కడికి పంపితే స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది.

>
మరిన్ని వార్తలు